Prabhakar Rao: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. సీఆర్పీసీ 73 సెక్షన్ కింద ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిందితులు అమెరికాలో ఉన్నందున నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు విజ్ఞప్తి చేశారు. నాంపల్లి కోర్టు ఇందుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు, ఐ న్యూస్ మీడియా అధినేత శ్రవణ్ రావులకు నాన్ బెయిలబుల్ వారెంట్ను నాంపల్లి కోర్టు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు పోలీసు అధికారులను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ప్రణీత్ రావు, భుజంగరావు సహా పలువురు అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. కానీ, అంతలోపే ప్రభాకర్ రావు దేశం దాటారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్టు ఆయన సన్నిహితులకు తెలియజేసినట్టు సమాచారం. రెండు మూడు నెలల తర్వాత తిరిగి వస్తాననీ పేర్కొన్నట్టు తెలిసింది. కానీ, ప్రభాకర్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లిపోయారనే వార్తలూ వచ్చాయి.
Read Also: దేవుడి పేరుతో రాజకీయమా?
ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి పంజాగుట్ట పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి దారులు సుగమం చేసుకుంటున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి ముందస్తుగా కోర్టు అనుమతి తప్పనిసరి. అందుకే నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. దీంతో త్వరలోనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయి.