Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) అమ్ములపొదిలో అత్యంత కీలకమైన సరికొత్త అస్త్రం చేరబోతోంది. డ్రాగన్ దేశం చైనా ఐదవ తరం స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేసిన ఏకంగా 40 షెన్యాంగ్ జే-35 యుద్ధ విమానాలను (Shenyang J-35) పాకిస్థాన్కు అందించనుంది. త్వరలోనే ఇవి అందనున్నాయి. జే-35 ఫైటర్ జెట్లను పాక్ వాయుసేనలో ప్రవేశపెడితే, ‘స్టెల్త్ టెక్నాలజీ’తో (Stealth Technology) తయారైన విమానాలను ఉపయోగించే అతికొద్ది దేశాల సరసన పాక్ చేరుతుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) వద్ద ప్రస్తుతానికి స్టెల్త్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ లేవు. స్వదేశీ ఐదవ తరం స్టెల్త్ యుద్ద విమానాలైన ‘అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్’లను (AMCA) వాయుసేనలో ప్రవేశపెట్టడానికి ఇంకా కనీసం ఒక దశాబ్దకాలం పట్టే అవకాశం ఉంది. అధికారిక అంచనాల ప్రకారం, 2035 నాటికి ఈ విమానాలు ఐఏఎఫ్ చేతికి అందుతాయి.
పాకిస్థాన్ స్టెల్త్ యుద్ధ విమానాలను వినియోగించనుండడంతో, వాటిని ఎదుర్కొనే కార్యాచరణను భారత్ సంసిద్ధం చేసుకోవాలని ఐఏఎఫ్ సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. పాకిస్థాన్కు నలబై షెన్యాంగ్ జే-35 స్టెల్త్ యుద్ధ విమానాలు అందనుండడం నిజమేనని మాజీ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్, రక్షణరంగ విశ్లేషకుడు అయిన అజయ్ అహ్లవత్ (రిటైర్డ్) చెప్పారు. అధునాతన ఈ యుద్ధ విమానాలను నడపడంలో పాకిస్థాన్ పైలట్లు చైనాలో శిక్షణ కూడా తీసుకుంటున్నారని ధృవీకరించారు.
Read this- Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..
‘‘పాకిస్థాన్ జే-35 యుద్ధ విమానాలను అందుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఎంపిక చేసిన పైలట్ల బృందం ఇప్పటికే ఆరు నెలలకు పైగా చైనాలో శిక్షణ తీసుకుంటోంది. ఆ విమానాలు అందడానికి ముందుగానే వాళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పాకిస్థాన్కు చైనా అందించబోతున్నది ఎఫ్సీ-31 విమానాలు. జే-35 విమానాలకు కాస్త తక్కువనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా వీటిని వాడుతున్నారు. పూర్తి వెర్షన్ను ఎవ్వరూ వేరు దేశానికి అందించరు. ఇందులో ఆశ్చర్యపడాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, షెడ్యూల్ కంటే కాస్త ముందుగానే విమానాలను అందిస్తున్నారు’’ అని అహ్లవత్ వివరించారు. ఎఫ్సీ-31 అనేది జే-35కి ఎగుమతి వేరియంట్ అని వివరించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లకు సేవలు అందిస్తున్న యుద్ధ విమానాలతో పోల్చితే ఇవి తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని వివరించారు.
ఇంతకాలం మనదే పైచేయి
భారత వైమానిక దళం చాలా కాలంగా పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్పై ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. అత్యున్నత శిక్షణ, వ్యూహాలు, వైవిధ్యమైన ఆవిష్కరణలతో దూసుకెళుతోంది. అయితే, జే-35 యుద్ధ విమానాలు పాకిస్థాన్ చేతికి అందితే మాత్రం, భారత వాయుసేన ఆధిపత్యానికి ముప్పు వాటిల్లుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించేదేనని అహ్లవత్ విశ్లేషించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి, చైనాను మించి కాకపోయినప్పటికీ, కనీసం పాకిస్థాన్పైనైనా ఆధిపత్యాన్ని సాధించేలా అధునాతన అస్త్రాల సమీకరణకు మనం గట్టి పోరాటం చేశాం. ఏదేమైనప్పటికీ జే-35కి చెందిన ఏ వెర్షన్ విమానాలపైనైనా పాకిస్థాన్ జెండా ముద్రపడిందంటే మనకు ఆందోళన కలిగించేదే అవుతుంది. దురదృష్టవశాత్తు, మన వద్ద రెండూ ‘బ్యాడ్ ఆప్షన్స్’ మాత్రమే ఉన్నాయి. ఎఫ్-35, సుఖోయ్-57 ఉన్నాయి. ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) ఏకైక అత్యుత్తమ ఆప్షన్గా మారుతుంది. ఈ సమస్యను అధిగమించాలంటే అందుబాటులో ఉన్న ఏకైక మార్గం ఏంటంటే, జాతీయ మిషన్ కింద ఏఎంసీఏను వీలైనంత త్వరగా రూపొందించాలి’’ అని అహ్లవత్ చెప్పారు.
Read this- Passwords leaked: ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం.. 1600 కోట్ల పాస్వర్డ్స్ లీక్
కాగా, ఏఎంసీఏ ప్రతిష్టాత్మక ట్విన్-ఇంజిన్ స్టెల్త్ ఫైటర్ ప్రోగ్రామ్. ఈ టెక్నాలజీ తయారీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భారత ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), వైమానిక దళం, నావికాదళం ఉమ్మడిగా దీనిని తయారు చేస్తున్నాయి. 2028-29 నాటికి ప్రోటోటైప్ రోల్-అవుట్, 2035 లోగా పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.
స్టెల్త్ టెక్నాలజీ అంటే?
శత్రుదేశాలు లేదా ప్రత్యర్థులు విమానాలను గుర్తించడానికి వీలులేకుండా ‘స్టెల్త్ ఫైటర్ జెట్స్’ను తయారు చేశారు. ఇందుకోసం స్టెల్త్ టెక్నాలజీని ఉపయోగించారు. రకరకాల సాంకేతికతలను ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. రాడార్, ఇన్ఫ్రారెడ్, విజిబుల్ లైట్, రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, ఆడియో వీటన్నింటి ప్రతిబింబం లేదా ఉద్గారాలను చాలా వరకు తగ్గించే విధంగా ‘స్టెల్త్ టెక్నాలజీ’ ఉపయోగపడుతుంది. అందుకే, ఈ రకమైన విమానాలను ఉపయోగించినవారికి ఆధిపత్యం లభిస్తుంది.