Leopard: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్ మండలం, బీబీపేట్ గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఓ చిరుతపులి సంచారం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. జనావాసాల మధ్యకు, గ్రామంలోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. బీబీపేట్ గ్రామానికి చెందిన, కల్హేర్ మండలం మాజీ జెడ్పీటీసీ గుండు మోహన్ ఇంట్లోకి అకస్మాత్తుగా చిరుతపులి చొరబడటం కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ప్రాణభయంతో బయటికి పరుగులు తీయడంతో పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Also Read: Manchu Lakshmi: నేను క్షేమంగానే ఉన్నా.. ఎయిరిండియా ఘటనపై మంచు లక్ష్మీ వీడియో వైరల్!
భయంతో వణికిపోతున్న ప్రజలు
సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే అప్రమత్తమయ్యారు.పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ, చిరుతను భయపెట్టి బయటకు తరిమివేయడానికి ప్రయత్నించారు. అయితే, చిరుత ఎటువైపు వెళ్లిందో స్పష్టత లేకపోవడంతో గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. చిరుతపులి తిరిగి వచ్చి దాడి చేస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. గ్రామస్థులు తక్షణమే అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకోవాలని, తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారులు చిరుతపులి గుర్తులను, ఇతర వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. గ్రామంలో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది.
Also Read: ISRO – Ax-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. డేట్ ఫిక్స్ చేసిన ఇస్రో.. ఎప్పుడంటే?