ISRO – Ax-4 Mission: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఆయన రోదసి యాత్రకు సంబంధించి తాజాగా ఇస్రో (Indian Space Research Organisation) కొత్త తేదీని ప్రకటించింది. యాక్సియం – 4 మిషన్ లో భాగంగా శుంభాంశు మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి నిందిలోకి దూసుకెళ్లనున్నారు. కాగా మిషన్ పైలట్ గా శుభాంశు బాధ్యతలు నిర్వహించనున్నారు. 14 రోజుల పాటు వీరు అంతరిక్షంలోనే గడగపనున్న ఇస్రో స్పష్టం చేసింది.
పలుమార్లు వాయిదా పడుతూ..
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ (Axiom Space) ఈ మిషన్ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. వాస్తవానికి గత నెల మే 29న ఈ ప్రయోగాన్ని చేపట్టాలని భావించారు. సాంకేతిక కారణాల దృష్ట్యా జూన్ 8, జూన్ 10, జూన్ 11 తేదీ అంటూ మిషన్ వాయిదా పడుతూ వచ్చింది. రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవుతున్న సమస్యను పరిష్కరించడంతో ఇస్రో తాజాగా కొత్త తేదీని ప్రకటించింది.
మిషన్ లక్ష్యాలు ఇవే!
యాక్సియం-4 మిషన్ కు సంబంధించిన ప్రయోగం.. ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ (Kennedy Space Center in Florida) నుంచి జరగనుంది. ఫాల్కన్ – 9 రాకెట్ (Falcon 9 rocket) ద్వారా శుభాంశు శుక్లా, అతడి వ్యోమగాముల టీమ్ నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) తో అనుసంధానం కానుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటూ పలు ప్రయోగాలు చేయనుంది. శాస్త్రీయ పరిశోధనలు, విద్యా సంబంధిత కార్యక్రమాలు, వాణిజ్య కార్యకలాపాలను శుభాంశు బృందం ఐఎస్ఎస్లో చేయనుంది. ఈ మిషన్లో 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ అధ్యయనాలు జరగనున్నట్లు సమాచారం.
Also Read: Politician: రాబోయే 3 నెలల్లో ప్రముఖ రాజకీయ నేత మృతి.. ఇంతకీ ఎవరది?
శుభాంశు శుక్లా ఎవరు?
యాక్సియం-4 మిషన్ లో కీలకంగా వ్యవహరించనున్న శుభాంశు శుక్లా విషయానికి వస్తే ఆయన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయనకు 2,000 గంటలకు పైగా యుద్ధ విమానాలను నడిపిన అనుభవం ఉంది. 2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసినప్పుడు, శుక్లా వారిలో ఒకరిగా ఎంపికయ్యారు. ఆయన మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో కఠినమైన శిక్షణ పొందారు. 2024 మార్చిలో గ్రూప్ కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందిన శుక్లా, యాక్సియం-4 మిషన్లో పైలట్గా ఎంపికయ్యారు. 1984లో రాకేశ్ శర్మ తొలిసారి అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టగా.. ఆయన తర్వాత వెళ్లబోతున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా నిలవబోతున్నారు.