Medchal District Corruption: ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం. అంతా మామూళ్లమయం. మేడ్చల్ జిల్లాలో అవినీతి అదే రీతి అన్నట్లుగా ఉండడంతో స్థానిక ప్రజానీకం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ అదీ అని లేకుండా దాదాపుగా అన్ని శాఖల్లోనూ కొంతమంది అధికారులు ప్రతి పనికీ పైసలతోనే ముడిపెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో దస్త్రం కదలాలన్నా ఏ చిన్న అనుమతికైనా ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి జిల్లాలో ఇంతకింతకు పెరుగుతోంది. ఇంత ఇస్తేనే పని చేస్తామనే పంథా కొందరు ఉద్యోగుల నుంచి వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
దొరికేది కొందరే
ప్రతి శాఖలో ఉన్న అవినీతి అధికారుల్లో కొంతమంది మాత్రమే అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. అది కూడా డబ్బులు ఇవ్వలేక విసిగిపోయిన వారు ఏసీబీని సంప్రదించి ఆయా అధికారుల భరతం పడుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నిత్యం వందలాది మంది ప్రతి పనికీ ఉద్యోగులు అడిగినంత చేతిలో పెట్టేసి కావాల్సిన పనిని చక్కబెట్టుకుంటున్నారు. ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా తమ పని పూర్తయితే చాలనే తీరున వ్యవహరిస్తున్నారు. దీంతో దొరకకుండా తప్పించుకునే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. కంచే చేను మేసిన చందంగా కింది స్థాయి మొదలుకుని పై స్థాయి అధికారుల వరకూ అందరూ లంచాలకు అలవాటుపడిపోతున్నారు. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి బాధితుల్లో నెలకొంది. మేడ్చల్ జిల్లాలో ఈ ఏడాదిలోనే వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖలకు చెందిన వారే ఎక్కువగా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికీ ఉద్యోగుల తీరు మారకపోవడం గమనార్హం.
Also Read: Serilingampally: వరద నీటితో మునిగిని లింగంపల్లి అండర్ బ్రిడ్జి!
మూడు, నాలుగు నెలల్లో అనేక ఘటనలు
పెళ్లి బ్యాండ్ వాహనాన్ని రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై శంకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. మధ్యవర్తిగా నాగేందర్ అనే వ్యక్తిని పెట్టుకుని రూ.15 వేలు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డారు. మిథిలానగర్లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు ఏఈ జ్ఞానేశ్వర్ కాంట్రాక్టర్ను రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. రూ.30 వేలకు బేరం కుదిరి కాంట్రాక్టర్ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
చేతి తడిపితే పనిపక్కా
నాగారం మున్సిపాలిటీ డిఈఈ రఘు సీసీ రోడ్డు పనులకు సంబంధించి రూ.11లక్షల బిల్లును క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ను 16 శాతం(రూ.1.30లక్షలు) లంచం డిమాండ్ చేశారు. రూ.లక్ష లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ వ్యక్తి ఇంటి ముందున్న 11కెవి విద్యుత్తు లైన్ను మార్చేందుకు డి.పోచంపల్లి విద్యుత్ శాఖ ఏఈ సురేందర్ రెడ్డి రూ.30వేల లంచం డబ్బులను తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు మరో వ్యక్తిని తప్పించేందుకు లంచం డిమాండ్ చేసి శామీర్పేట్ ఎస్సై పరశురామ్ ఏసీబీకి పట్టుబడ్డారు. గతంలోనే రూ.2లక్షలు తీసుకోగా ఆతర్వాత మిగిలిన రూ.22వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
మారని అధికారులు తీరు
విద్యుత్ పోల్ మార్చేందుకుగాను ఎల్సీ ఇచ్చేందుకు ఓ వ్యక్తిని ఘట్కేసర్ ఏఈ(ఆపరేషన్స్) బలరాం నాయక్, లైన్ ఇన్స్పెక్టర్ హేమంత్ నాయక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మహేష్లు రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన పదిహేను రోజులకే వీరు ఏసీబీకి చిక్కారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ షమీలు రూ.80వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం డబ్బుల్లో రూ.50వేలు నేరుగా ఇవ్వగా మిగిలిన రూ.30వేలు గూగుల్ పే ద్వారా బాధితుడు ఇచ్చాడు.
Also Read: Pakistan Water Crisis: పాక్లో మరింత ముదిరిన నీటి కష్టాలు.. ఖరీఫ్ సీజన్పై లోబోదిబో!