Hydraa: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని నాలాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొద్ది రోజులుగా హైడ్రా ప్రతి ప్రజావాణిలో ప్రత్యేకంగా హైడ్రాపై ఫిర్యాదులు స్వీకరిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగానే సోమవారం హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో నాలాల కబ్జాలపై హైడ్రా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. హైడ్రా ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులందగా, ఇందులో 60 శాతానికి పైగా నాలాల కబ్జాలపైనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నగరంలో ఏ నాలాను పరిశీలించినా, వాస్తవ వెడల్పునకు 50 శాతానికి పైగా కబ్జా అయినట్టు ఫిర్యాదుదారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. నాలాలను పూర్తిస్థాయిలో విస్తరించినట్టయితే, వరదలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చుననన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాలాలు పొంగి ఇళ్లలోకి, అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరి విలువైన వస్తువులు నష్టపోవల్సి వస్తుంది.
తూకానికి అమ్ముకోవాల్సి వస్తోంది
కార్లు, ఇతర వాహానాలు సైతం నీట మునగడంతో తూకానికి అమ్ముకోవాల్సి వస్తోందని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే కంటి మీద కునుకు లేకుండా గడపాల్సి వస్తోందని, వరద ముంచెత్తిన తర్వాత మళ్లీ సాధారణ స్థితికి ఇళ్లను తీసుకురాడానికి రోజులు పడుతోందని మరి కొందరు ఫిర్యాదుల్లో వాపోయారు. రసూల్పురా వద్ద ప్యాట్నీ నాలా మాదిరిగానే, చీకోటి గార్డెన్స్తో పాటు ప్రకాష్నగర్ మెట్రో స్టేషన్ వద్ద నాలా వెడల్పును పెంచాలని పలువురు ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలపై ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి, స్వీకరించారు. ఈ ఫిర్యాదులను ఫీల్డు లెవెల్ లో పరిశీలించిన తర్వాత చర్యలుంటాయని ఆయన ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు.
Also Read: Bala Bharosa: బాల భరోసా పేరుతో కొత్త స్కీం.. మంత్రి సీతక్కవెల్లడి!
ఫిర్యాదులిలా..
అమీన్పూర్ మున్సిపాలిటీలోని దుర్గా ప్రావిన్స్ కాలనీ ప్రతి సంవత్సరం వరదలకు గురవుతోందని, మా ఇళ్ళు, రహదారులు నీటిలో మునిగిపోతాయని, సమీపంలోని అనేక కాలనీల నుండి వర్షపు నీటిని నేరుగా మా వైపు మళ్లించడం ద్వారా మరింత ఇబ్బంది ఏర్పడుతోందని, పిల్లలు, వృద్ధులు రోజుల తరబడి ఇంటి లోపలే చిక్కుకుపోతున్నారు. గత సంవత్సరం రెండుసార్లు సంగారెడ్డి అదనపు కలెక్టర్ కూడా సందర్శించారు. సహజ నీటి మార్గాలు ఉన్న చోట కొత్త భవనాలు వచ్చాయి. ఒకసారి పరిశీలించి వరద నీటి కాలువలు చెరువులకు అనుసంధానమైనట్టు చూడాలని దుర్గా ప్రావిన్స్ కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
అక్రమంగా రోడ్డు నిర్మాణం
లంగర్ హౌస్ చెరువు 38 ఎకరాలు విస్తీర్ణంలో ఉండేదని, ఇప్పుడు ఆ చెరువు 24 ఎకరాలకు మిగిలిందని, కొందరు చెరువును కబ్జా చేస్తున్నట్లు కూడా హైడ్రాకు ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు గాను చెరువు తూములను కూడా ధ్వంసం చేశారని, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్భలంతో చెరువు ఫెన్సింగ్ ను విరగొట్టి,అక్రమంగా రోడ్డు నిర్మాణం చేసి చెరువు స్వభావాన్ని పూర్తిగా మార్చేశారని, రాకపోకలు సాగించడమే కాకుండా,పార్కింగ్ యార్డుగా మార్చేశారని, ఆక్రమణలను తొలగించి చెరువుకు పూర్వ వైభవం తీసుకువచ్చి, పూర్తిగా ఆధునికరించాలని ఫిర్యాదు అందింది.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు
మియాపూర్ సర్వే నెం.39లో మక్త మహబూబ్ పేట చెరువు కబ్జాకు గురివుతోందని, అలాగే మైనింగ్ ల్యాండ్ సర్వే నెం. 44/5 లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని, మైనింగ్ ల్యాండ్ను బై నెంబర్, నకిలీ పత్రాలు సృష్టించి 12 షెటర్లు వేశారని, 2013 లో తహశీల్దార్ నోటీనులు ఇచ్చి కూల్చేశారని, ఆ భూమి విలువ సుమారుగా రూ.300 కోట్లు ఉంటుందని, ఆ భూమికి కబ్జా నుంచి విముక్తి కల్గించి, భాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు ఫిర్యాదు సమర్పించినట్లు హైడ్రా అధికారులు తెలిపారు.
ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఆనంద్బాగ్ కాలనీలోని స్ట్రీట్ నంబరు 10, 11 లలో రాకపోకలకు వీల్లేకుండా, రెండు రహదారులను 2019 వ సంవత్సరం నుంచి మూసేశారని, 14 ఏళ్లుగా వినియోగించిన రహదారులను మూసేయడంతో తాము వేరే కాలనీల నుంచి రాకపోకలు సాగించాల్సి వస్తోందని స్థానికుల నుంచి ఫిర్యాదు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదే జిల్లా దొమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రగతినగర్ కాలనీలో మొత్తం 300ల కుంటుంబాలుండగా, ఇందులోని పార్కు స్థలాన్ని కబ్జాచేశారంటూ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసినట్లు హైడ్రా వెల్లడించింది.
Also Read: Land Encroachments: ఫేక్ నోటరీలతో భూ ఆక్రమణలు.. ఓ కాంగ్రెస్ నేత అంతులేని ఆగడాలు!