Property Tax: గ్రేటర్ హైదరాబాద్ మహానగరవాసులకు ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీలో మళ్లీ ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై ఇకపై ప్రతి నెల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే. ప్రతి నెల రూ.300 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ చేసేలా ఉన్నతాధికారులు సిబ్బందికి టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ ట్యాక్స్ విభాగం సిబ్బంది, అధికారులు అర్థ సంవత్సరం ముగిసిన తర్వాత అంటే అక్టోబర్ తర్వాతే కలెక్షన్ కోసం హడావుడి చేసేవారు.
రూ.300 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ వసూలు
కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇకపై ప్రతి నెల దేవుడెరుగు గానీ, ప్రతి రోజు కలెక్షన్ కోసం హడావుడి చేయాల్సిందే. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు చేసిన అప్పులు రూ.6500 కోట్లకు గాను ప్రతి నెల రూ. 110 కోట్ల కిస్తీని అసలు, మిత్తీల కింద చెల్లించాల్సి ఉండగా, మరో రూ.135 కోట్లు పర్మినెంట్, ఔట్ సోర్స్ ఉద్యోగుల జీతాలు, రిటైర్డు ఉద్యోగులకు పెన్షన్లు, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్లు బిల్లులు మరో రూ.వంద కోట్లు, దీనికి తోడు రొటీన్ మెయింటనెన్స్ కు కూడా ప్రతి నెల కోట్లలో చెల్లించాల్సి ఉన్నందున సిబ్బందికి నెలకు రూ.300 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ వసూలు చేస్తే గానీ పొద్దు గడవని పరిస్థితి నెలకొంది.
Also Read: Land Encroachments: ఫేక్ నోటరీలతో భూ ఆక్రమణలు.. ఓ కాంగ్రెస్ నేత అంతులేని ఆగడాలు!
30 కోట్లు తిరిగి సర్కారు ఖజానాకు
జీహెచ్ఎంసీకి ఆర్థిక చేయూతనందించేందుకు కొద్ది నెలల క్రితం గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో సర్కారు జీహెచ్ఎంసీకి బకాయిపడ్డ మ్యుటేషన్ ఛార్జీల బకాయిల్లో భాగంగా రూ. 3 వేల 30 కోట్లను పీ అండ్ డీ అకౌంట్ కు బదలాయించిన సంగతి తెల్సిందే. వీటిలో జీహెచ్ఎంసీ కేవలం రూ. వెయ్యి కోట్లను మాత్రమే వివిధ రకాల బిల్లులకు వినియోగించుకోగా, అంతలో ఆర్థిక సంవత్సరం మారటంతో జీహెచ్ఎంసీ పీ అండ్ డీ ఖాతాలో మిగిలిపోయిన రూ.2 వేల 30 కోట్లు తిరిగి సర్కారు ఖజానాకు వెళ్లిపోయాయి.
దీంతో జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీ కావటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. సర్కారు ఖజానాకు వెళ్లిపోయిన రూ.2 వేల 30 కోట్లను తిరిగి పీ అండ్ డీ ఖాతాకు రప్పించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల ప్రయత్నాలు ఫలించి సర్కారు ఇటీవలే రూ.1300 కోట్ల పై చిలుకు నిధులను మళ్లీ జీహెచ్ఎంసీ పీ అండ్ డీ ఖాతాకు బదలాయించినా, నెలకు రూ.300 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ చేస్తే గానీ జీతాలు, పెన్షన్లు చెల్లించే పరిస్థితుల్లేక, సిటీలోని 30 సర్కిళ్లలోని 300 ప్రాపర్టీ ట్యాక్స్ డాకెట్లకు రోజువారీ, వారం, నెల చివరి కల్లా ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు సమాచారం.
నిధుల్లేక ఆగిన స్థల సేకరణ
జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభం నిధుల లేమి ఎఫెక్టు క్రమంగా ప్రాజెక్టులు, రోడ్డు విస్తరణపై కూడా పడుతుంది. జీహెచ్ఎంసీ ఇప్పటికే వివిధ ప్రాజెక్టులకు సేకరించిన స్థలాలకు సంబంధించి యజమానులకు పరిహారం చెల్లించేందుకు నిధుల్లేకపోవటంతో కొత్తగా చేపట్టాల్సిన స్థల సేకరణ ప్రక్రియ అర్థాంతరంగా నిల్చిపోయినట్లు సమాచారం. ఇటీవలే పది మెయిన్ రోడ్లతో పాటు మరి కొన్ని రోడ్ల విస్తీర్ణకు స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసినా, స్థలాలిచ్చేందుకు యజమానులు సిద్దంగా ఉన్నా,స్థల సేకరణ చేయలేని పరిస్థితి దాపురించింది.
మరో వైపేమో జీహెచ్ఎంసీ స్థలాలకు నష్టపరిహారం చెల్లింపు కాకుండా ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్ ) ఇవ్వాలని భావిస్తున్నా, తీసుకునేందుకు భూ యజమానులు ససేమిరా అంటున్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో స్థల సేకరణకు జీహెచ్ఎంసీ రూ.700 కోట్లను కేటాయించగా, ఆ మొత్తం ఖర్చు చేసింది. తాజాగా వర్తమాన ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కూడా రూ.700 కోట్లను కేటాయించినా, నిధుల లేమి కారణంగా ఇప్పటి వరకు అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని సమాచారం. పాతబస్తీలో రోడ్డు విస్తరణ స్థల సేకరణ మినహా జీహెచ్ఎంసీ నగరంలో చేపట్టాల్సిన స్థల సేకరణ పనులు ఎక్కడికక్కడే నిల్చిపోయినట్లు సమాచారం. పాతబస్తీ మెట్రోరైలు కారిడార్ కోసం స్థల సేకరణ కు నష్టపరిహారాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ గజానికి రూ. 81వేల వరకు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు తెలిసింది.
Also Read: IAS Bribe Scandal: అడ్డంగా దొరికిన ఐఏఎస్.. ఇదేం పాడు పనయ్యా నీకు?