Mahua Moitra: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) నేత మహువా మొయిత్రా మరోసారి దాన్ని నిరూపించారు. 50 ఏళ్ల వయసులో బిజు జనతా దళ్ (BJD) నేత పినాకి మిశ్రా (Pinaki Misra) ను పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించారు. తన భర్తతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను మహువా గురువారం ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖులు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరూ జర్మనీలో వివాహం చేసుకున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి.
శశిథరూర్ స్పెషల్ ట్వీట్
మహువా మొయిత్రా, పినాకి మిశ్రాలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా స్నేహితులు మహువా మొయిత్రా, పినాకి మిశ్రాలు వివాహ జీవితాన్ని ప్రారంభించారు. వారికి శుభాకాంక్షలు. వీరు సుదీర్ఘమైన ఆనంద జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా. వారికి నా ఆశీర్వాదాలు’’ అని పోస్ట్ పెట్టారు.
మహువా మొయిత్రా రాజకీయ జీవితం
పశ్చిమ బెంగాల్కు చెందిన మహువా మొయిత్రా కరీంపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కృష్ణ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2024లో డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్టు మహువాపై వేటు పడింది. ఏకంగా లోక్సభ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని సీరియస్గా తీసుకున్న మహువా మొయిత్రా సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి 50వేలకు పైగా ఓట్లు సాధించి గెలుపొందారు. రాజకీయాల్లోకి రాకముందు మొయిత్రా చాలా భిన్నమైన జీవితాన్ని గడిపారు. 1998లో అమెరికాలోని ప్రతిష్టాత్మక మౌంట్ హోలీయోక్ కాలేజీలో ఆర్థిక శాస్త్రం, గణితంలో పట్టభద్రులయ్యారు. 2008లో భారతదేశానికి తిరిగివచ్చి రాజకీయాల్లోకి రావడానికి తన ఉన్నతమైన బ్యాంకింగ్ ఉద్యోగాన్ని వదిలేశారు. మొదట కాంగ్రెస్ యువజన విభాగంలో పని చేశారు. తర్వాత టీఎంసీలో చేరారు.
Read Also- Akhil Zainab: అఖిల్, జైనబ్ పెళ్లి చేసుకోబోతుంటే.. ఇప్పుడీ వార్తలేంటి?
గతంలో ఫైనాన్షియర్తో పెళ్లి
మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్ను పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు. చాలాకాలం తర్వాత పెళ్లి, విడాకుల గురించి స్పందించారు.
ఎవరీ పినాకి మిశ్రా?
జేజేడీ నాయకుడైన 66 ఏళ్ల పినాకి మిశ్రా సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేశారు. 1959లో జన్మించారు. ఢిల్లీ విశ్వ విద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేశారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. చాలాకాలం న్యాయవాదిగా పని చేసిన తర్వాత పినాకి మిశ్రా రాజకీయాల్లోకి వచ్చారు. పూరీ నుంచి నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్లో ఆర్థిక స్టాండింగ్ కమిటీ, వ్యాపార సలహా కమిటీ సహా అనేక ఉన్నతస్థాయి ప్యానెల్స్లో సభ్యుడిగా ఉన్నారు. 1996లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి మొదటిసారి ఎంపీ అయ్యారు. తర్వాత 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. గతంలో సంగీత మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మహువా మొయిత్రాను పినాకి మిశ్రా పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.
Read Also- Ram Gopal Varma: వర్మ అరాచకం.. మెగా ఫ్యామిలీపై మళ్లీ..!