Train Accident: గొర్రెల మేత కోసం చెట్టుపైకి ఎక్కిన అన్నదమ్ములు కొమ్మ విరిగి పోవటంతో ట్రాక్ పై పడిపోగా దూసుకొచ్చిన రైలు వారి పైనుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ విషాదం ఉదయం యాఖుత్ పురా రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. మరో నాలుగు రోజుల తరువాత బక్రీద్ పండుగను సంతోషంగా జరుపుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: GHMC R V Karnan: వివాదాస్పదం కానున్న.. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్!
యాఖుత్ పురా సొంటే పీర్ కీ దర్గా ప్రాంత నివాసులైన షాహబుద్దీన్ (26), ఫైజాన్ (21) అన్నదమ్ములు. ఈనెల 7న బక్రీద్ పండుగ ఉండటంతో సన్నాహాలు చేసుకుంటున్నారు. పండుగ ముందు రోజు కొంటే గొర్రెల ధర ఎక్కువగా ఉంటుందని రెండు రోజుల క్రితమే కొని పెట్టుకున్నారు. అప్పటి నుంచి యాఖుత్ పురా రైల్వే స్టేషన్ వద్దకు వాటిని తీసుకొచ్చి మేత పెడుతున్నారు. ఎప్పటిలానే సోమవారం ఉదయం అన్నదమ్ములిద్దరు గొర్రెలతో రైల్వే స్టేషన్ వద్దకు వచ్చారు.
ఓ చెట్టుపైకి ఎక్కి కొమ్మలు విరుస్తూ కింద ఉన్న గొర్రెలకు వేస్తున్నారు. అదే సమయంలో కొమ్మ విరిగి పోవటంతో ఇద్దరు ట్రాక్ పై పడిపోయారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన రైలు పైనుంచి వెళ్లటంతో షాహబుద్దీన్, ఫైజాన్ లు ప్రమాద స్థలంలోనే మరణించారు. విషయం తెలిసి యాఖుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్దకు వచ్చి మృతుల కుటుంబాలను ఓదార్చారు.
Also Read: Drug Peddlers Arrested: డ్రగ్స్ ముఠా అరెస్ట్.. కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు సీజ్!