Drugs Seized: పక్కాగా సమాచారాన్ని సేకరించిన శంషాబాద్ ఎస్వోటీ అధికారులు షాద్ నగర్ పోలీసులతో కలిసి నలుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 3.05కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, ఓపీఎం, పాపీ స్ట్రా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీలు బీ.రాజేశ్, పీ.శోభన్ కుమార్, అదనపు డీసీపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.
ఉద్యోగం వెతుక్కుంటూ…
రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాకు చెందిన వికాస్ సోహూ (26) 2016లో ఉద్యోగం వెతుక్కుంటూ షాద్ నగర్ కు వలస వచ్చాడు. జాతీయ రహదారి 44పై రాయికల్ టోల్ గేట్ వద్ద ఉన్న సంజూ భాయ్ మార్వాడీ దాబాలో వాచ్ మెన్ గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పని చేస్తూనే వంట పని నేర్చుకున్న వికాస్ ఆ తరువాత కుకింగ్ మాస్టర్ గా మారాడు. ఇదెలా ఉండగా దాబా యజమాని అయిన సంజూ భాయ్ కి గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో ధూల్ పేటకు చెందిన సలీం అనే వ్యక్తి నుంచి గంజాయి కొని తెచ్చుకుని దాబాలో పెట్టుకునేవాడు. దానిని సేవించటంతోపాటు దాబాకు వచ్చే లారీ డ్రైవర్లు, ఇతరులకు అమ్మేవాడు కూడా. ఈ క్రమంలో సంజూ భాయ్, వికాస్ లు 2022లో గంజాయితో జడ్చర్ల పోలీసులకు పట్టుబడ్డాడు.
Also Read: KTR on BRS: సంపద సృష్టిలో.. దేశంలో తెలంగాణదే అగ్రస్థానం!
5వందల రూపాయలకు కొని 15వందల రూపాయలకు విక్రయించేవారు
ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన అతను కొన్నాళ్ల తరువాత బెయిల్ మీద విడుదలై గంజాయి దందా కొనసాగించారు. జల్ పల్లికి చెందిన రాజు అనే వ్యక్తి నుంచి 300 రూపాయలకు 25 గ్రాముల గంజాయిని కొని 500 రూపాయలకు అమ్మేవారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గణపత్ అనే వ్యక్తి ద్వారా హెరాయిన్, ఓపీఎం, పాపీ స్ట్రా తెప్పించుకుని వాటిని కూడా విక్రయించటం ప్రారంభించారు. 10 గ్రాముల ఓపీఎంను 13వందల రూపాయలకు కొని 2వేల రూపాయలకు అమ్మేవారు. 250 గ్రాముల పాపీ స్ట్రాను 5వందల రూపాయలకు కొని 15వందల రూపాయలకు విక్రయించేవారు. ఒక గ్రాము హెరాయిన్ ని 12వేల రూపాయలకు కొని 15వేల రూపాయలకు అమ్మేవారు. కాగా, గంజాయి సేవించే అలవాటు ఉన్న సంజూ భాయ్ తీవ్ర అస్వస్థతకు గురై ఏప్రిల్ 28న చనిపోయాడు.
అప్పటి నుంచి వికాస్ ఒక్కడే మాదక ద్రవ్యాల దందా చేస్తున్నాడు. గత వారం గణపత్ నుంచి 1.5కిలోల హెరాయిన్, 750గ్రాముల ఓపీఎం, 3.5కిలోల పాపీ స్ట్రా కొన్నాడు. దాంతోపాటు రాజు నుంచి 1.5కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దీంట్లో నుంచి కొంతమేర విక్రయించి 90వేలు సంపాదించాడు. మిగితా డ్రగ్స్ ను దాబాలో భద్రపరిచాడు. ఈ మేరకు సమాచారాన్ని సేకరించిన శంషాబాద్ ఎస్వోటీ అధికారులు షాద్ నగర్ పోలీసులతో కలిసి దాబాపై దాడి చేశారు. వికాస్ ను అరెస్ట్ చేసి హెరాయిన్, ఓపీఎం, పాపీ స్ట్రా, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Alos Read: Indian Air Force Group C 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేయండి
నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు
అంతర్జాతీయ మార్కెట్ లో ఈ మాదక ద్రవ్యాల విలువ 3.05కోట్ల రూపాయలు ఉంటుందని కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు. ఇక, విచారణలో వికాస్ వెల్లడించిన వివరాలతో ధూల్ పేటకు చెందిన సలీం, జల్ పల్లి నివాసి రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గణపత్ ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం షాద్ నగర్ పోలీసులకు అప్పగించారు. మాదక ద్రవ్యాల దందా గురించి తెలిస్తే 100 లేదా 94906 17444 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కమిషనర్ అవినాష్ మహంతి కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. ఇక, ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థులపై ఓ కన్నేసి పెట్టాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Also Read: Harish Rao on Congress: అవినీతిని ఆధారాలతో బయటపెడ్తాం.. మాజీ మంత్రి కామెంట్స్!