Ranga Reddy district: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న సామెత మాదిరిగా రంగారెడ్డి జిల్లాలోని రెవెన్యూ శాఖలో పై స్థాయి అధికారులు మొదలుకుని కిందిస్థాయి సిబ్బంది వరకు అవినీతి జాడ్యం వేళ్లూనుకుపోయింది. పారదర్శక సేవలు, అక్రమాలకు చెక్ పెట్టేలా ఎన్ని సంస్కరణలు చేపట్టినా అవినీతి, అక్రమాలు ఆగడంలేదు. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. ఇష్టారాజ్యంగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా కింది స్థాయి ఉద్యోగులనే పావులుగా వాడుకుంటున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన ఘటన భూ లావాదేవీల్లో పై అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి మధ్య అంతర్లీనంగా సాగుతున్న ఆర్థిక వ్యవహారాన్ని మరోసారి బహిర్గతం చేసింది.
కలెక్టర్ల స్థాయిలోనూ ఆరోపణలు
గతంలో జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లపైనే అవినీతి ముద్ర పడడం రెవెన్యూలో ఉన్న అవినీతికి అద్దంపడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన హోలికేళి హయాంలో ఏకంగా 98 భూ రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయి. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్లు అమోయ్ కుమార్, హరీష్లు సైతం భూ సంబంధిత వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. 2024లో అప్పటి అదనపు కలెక్టర్(రెవిన్యూ) భూపాల్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. పై స్థాయి అధికారుల అక్రమాల కారణంగా కిందిస్థాయి అధికారుల్లోనూ భయం లేకుండా పోతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
ప్రతి పనికీ పైసా వసూల్
రెవెన్యూ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా. పైరవీ కారులు చెప్పాలి. పైసా లేనిదే పని కాదు. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు అంతా వసూళ్లే. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం. కొన్ని చోట్ల ఆఫీసులోని సిబ్బందే దళారులుగా వ్యవహరిస్తున్నారు. మామూళ్లు తీసుకుని పనులు చేసి పెడుతున్నారు. మ్యుటేషన్ మొదలుకుని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వరకు ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ల్యాండ్ కన్వర్షన్ వంటి వాటికి ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు చెల్లించినప్పటికీ అదనంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
పైసలిస్తే అసైన్డ్, భూదాన్, నిషేధిత జాబితాల్లోని భూములకు సైతం పట్టాలు ఇస్తున్నారన్న విమర్శలను రెవిన్యూ శాఖ మూటగట్టుకుంటోంది. లంచం ఇవ్వకపోతే కొర్రీలు పెట్టి ఆపేస్తున్నారు. వారసత్వం, ఫౌతీ వంటి చిన్నచిన్న వాటికి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికారులు ఇలా బరితెగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు మొరపెట్టుకుందామంటే ఇక్కడా అదే తంతు నడుస్తుండడంతో బాధితులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలో రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Ponnam Prabhakar: అక్రమ నల్లా కనెక్షన్లపై కఠినంగా వ్యవహరించాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశం!
చిరు ఉద్యోగులే బలి
రెవిన్యూ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులే బాస్గా వ్యవహరిస్తూ లంచాల జాడ్యాన్ని కొనసాగిస్తున్నారు. లంచాలను వసూళ్లు చేసేందుకు కొందరు అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని ఎంచుకుంటున్నారు. అయితే అవినీతి బయటకు వచ్చిన సందర్భాల్లో మాత్రం అధికారులు తెలివిగా తప్పించుకుని కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారు. ఓ భూమి విషయంలో రూ.12లక్షలు లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై రెండు రోజుల క్రితం ఇబ్రహీంపట్నం తహసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల సందర్భంగా విస్తుబోయే నిజాలు బయట పడ్డాయి. ఆర్ఐని అదుపులోకి తీసుకుని విచారించగా లంచం డబ్బుల్లో ఆర్డీవోకు, తహసిల్దార్కు, డిఫ్యూటీ తహసిల్దార్కు సైతం వాటాలు ఉన్నట్లు చెప్పడం అందరినీ విస్తుబోయేలా చేసింది.
ఉన్నతాధికారులు ఎస్కేప్
కొద్దిరోజుల క్రితం కొత్తూర్ రెవిన్యూ శాఖలో లంచం డబ్బులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. రికార్డు అసిస్టెంట్ సాయంతో డిఫ్యూటీ తహసిల్దార్ డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు కేవలం రికార్డు అసిస్టెంట్ పైననే చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. గత కలెక్టర్ భారతిహోలికేరి చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఆమెను బదిలీ మాత్రమే చేసి ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులపై చర్యలు తీసుకుని మమ అన్పించారు. ఇలా అవినీతి అక్రమాల్లో పాత్రధారులైన ఉన్నతాధికారులు ఎస్కేప్ అవుతుండగా చిరు ఉద్యోగులే బలవుతూ వస్తున్నారు. ఇప్పటికైనా అవినీతి నిరోధక శాఖ, నిఘా వర్గాలు కింది స్థాయి సిబ్బందితో వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపైననూ దృష్టి సారించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: Telangana Formation Day: యువతకు గుడ్ న్యూస్.. రూ.8,000 కోట్లతో ఉపాధి.. డిప్యూటీ సీఎం వెల్లడి!