Mahanadu: మహానాడులో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నదుల అనుసంధానం గురించి ప్రస్తావించిన ఆయన.. ఈ ప్రక్రియ జరిగితే తెలంగాణకు కూడా లాభమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. నదీ జలాల వినియోగంలో ఏపీ చివరి రాష్ట్రంగా ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు తానెప్పుడూ అడ్డుచెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ‘ బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు. ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్లు. హైదరాబాద్ను (Hyderabad) అభివృద్ధి చేసింది నేనే. ఏపీలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా లక్ష్యం. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. జిల్లాకు చెందిన 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. లేపాక్షి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు అనువైన ప్రాంతం, ఇదే విషయమై కేంద్రంతో చర్చించాం. బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ (HAL) ను అనంతపురానికి తరలించాలని కేంద్రాన్ని కోరుతున్నట్టు కర్నాటక నేతలు అంటున్నారు. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను. ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను తరలించుకుపోవాలని నేను అనుకోను. గండికోటను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెడతాం’ అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also- Sr NTR Speech: మహానాడులో ఏఐ అద్భుతం.. కదిలొచ్చిన అన్నగారు..
తెలుగు గడ్డపైనే పుడతా..
‘ నా తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు చేసుకున్నాం. మళ్లీ జన్మ ఉంటే తెలుగు జాతీ కోసం తెలుగు గడ్డపైనే పుడతా. కార్యకర్తే అధినేత, కార్యకర్తలే సుప్రీం ఇదే పార్టీ సిద్ధాంతం. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణం. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది. 61 మంది గెలిచారు. నూతన నాయకత్వం తీసుకొచ్చాం. 2047కు తెలుగుజాతిని ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంచాలి. రాబోయే 40 ఏళ్లకు రోడ్మ్యాప్ రూపకల్పన చేసుకున్నాం. అతి చిన్నవయసులో కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉన్నారు. తెలుగుదేశం కొత్త తరహా పాలనకు శ్రీకారం చుట్టుంది. ప్రజాభిప్రాయలకు అనుగుణంగా పాలన అందిస్తున్నాం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. ప్రజలకు దగ్గరగా కార్యకర్తలు ఉండాలి. ప్రజల మెచ్చే పాలన అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన తెలుగు యువత, ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నంబర్ వన్ చేస్తారు. ఇది నా విశ్వాసం. దీన్ని గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ-రాజకీయ సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి. మహనీయులు, కారణ జన్ములు ఎన్టీఆర్కు మహానాడు వేదికగా ఘన నివాళులు అర్పిద్దాం. మొన్నటి మహానాడు వరకూ కార్యకర్తలుగా కింద ఉన్న వాళ్ళు, ఈ రోజు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా స్టేజీ పైకి వచ్చారు. ఇదొక చరిత్ర. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చే గౌరవం’ అని చంద్రబాబు ధీమాగా చెప్పారు.
కోవర్టులతో జాగ్రత్త..
‘ వివేకా హత్యకేసు విషయంలో నాలాంటి నాయకుణ్నే మోసం చేయగలిగారు. గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేశారు. అందిరిలా నేనూ నమ్మాను. సాయంత్రానికి గొడ్డలిపోటు విషయం బయటికి వచ్చింది. నాపై నెపం వేసేందుకు దుష్ప్రచారాలు చేశారు. కరుడుగట్టిన నేరస్థులతో రాజకీయం చేస్తున్నాం. కోవర్డులుగా ఉంటూ ఇష్టారీతిలో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులే వీరయ్య చౌదరిని హత్య చేశారు. టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తోంది. నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండండి. నేరస్థులు ఖబడ్దార్.. నా దగ్గర ఎవరి ఆటలు సాగవు. వలస పక్షులు వస్తాయి.. పోతాయ్. నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నా. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. ఆడబిడ్డలపై ఆసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరిరోజు అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తాం. దీపం-2 పథకంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రాజకీయంగా ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తాం. లక్షమంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తాం. కరుడుగట్టిన నేరస్థులైన ప్రత్యర్థులతో రాజకీయం చేస్తున్నాం. కోవర్టులుగా ఉంటూ ఇష్టారీతిలో హత్యా రాజకీయాలు చేస్తున్నారు. నేరస్థులు చేసే కనికట్టుపై అందరూ అప్రమత్తంగా ఉండండి’ అని తెలుగు తమ్ముళ్లకు మహానాడు వేదికగా చంద్రబాబు సూచించారు.
శభాష్ లోకేష్..
‘ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఆరు శాసనాలు ప్రతిపాదించిన లోకేష్ గారిని, అభినందిస్తున్నా. పార్టీ సిద్దాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకొచ్చిన నా తెలుగు కుటుంబం 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయి. ఎన్టీఆర్ ఆశీస్సులు మనకు ఉన్నాయి. తెలుగుజాతి 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్ అవుతుంది’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. గత నిరంకుశ పాలనపై తొలి తిరుగుబాటు యువగళం పాదయాత్ర పుస్తకాన్ని సీఎం చంద్రబాబుకు యువనేత నారా లోకేష్ అందించారు. కాగా, ఈ ఆరు సూత్రాల్లో తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం, స్త్రీశక్తి, పేదల సేవలో- సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత అనేవి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రకటించారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటున్నారు. 1995లో మొదటిసారి పార్టీ చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతున్నది.
Read Also- YSRCP: ‘కుప్పం’ సాక్షిగా నారా లోకేష్ మోసం బట్టబయలు.. పెద్ద కథే ఉందిగా..