Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్లో నిడదవోలు (Nidadavole) పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేసి అందమైన నిడదవోలుకు బాటలు వేస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు మున్సిపాలిటీ అధికారులతో సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. త్వరలోనే నిడదవోలు పట్టణాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపడతామని దుర్గేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 11 నెలల కాలంలో నిడదవోలు పట్టణంలో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరాలు వెల్లడించారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్ల అంచనా వ్యయంతో 240 అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నామన్నారు. రూ.8.12 కోట్లతో ఇప్పటికే 187 పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. మిగిలిన నిధులతో మిగిలిన అభివృద్ధి పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇది పేరుకే ఐ లవ్ నిడదవోలు కాదని.. అందమైన నిడదవోలుకు బాటలు వేస్తామన్నారు. అభివృద్ధిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు సమాన నిష్పత్తిలో ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ధ్యేయమన్నారు.
Read Also- AP Politics: సకల శాఖ మంత్రిగా లోకేష్ అవతారం!
త్వరలోనే గుడ్ మార్నింగ్..
త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోందని దుర్గేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా జూన్ 1వ తేదీ నుంచి ప్రతి వారంలో ఒకరోజు పట్టణంలో గుడ్ మార్నింగ్ నిడదవోలు (Good Morning Nidadavolu) కార్యక్రమాన్ని చేపట్టి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తనతో పాటు మున్సిపల్ ఛైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, కూటమి నాయకులు పాల్గొంటారని తెలిపారు. కాగా, ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమం తెలుగు ప్రజలందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే తొలిసారి వైసీపీ హయాంలో (ఎమ్మెల్యేగా) కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Kethireddy Venkatarami Reddy) ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ (Good Morning Dharmavaram) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఒక్కో ఏరియాకు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వెంటనే పరిష్కార మార్గం చూపించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఆయన వెంటే దాదాపు అన్ని శాఖల అధికారులు ఉండేవారు. ఏ సమస్య అయినా సరే ఈ కార్యక్రమంలో నిమిషాల్లోనే పరిష్కారం అయ్యేది. ఇందులో ఎన్నో కామెడీలు, పంచ్లు.. అంతకుమించి నవ్వు ఆపుకోలేని స్థాయిలో మాటలు కూడా కేతిరెడ్డి నోట వచ్చేవి. నాటి నుంచి నేటి వరకూ ఆయన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇంత చేసిన కేతిరెడ్డి.. 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అదే కేతిరెడ్డి బాటలో గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని కందుల దుర్గేష్ ప్రారంభించబోతున్నారు.
నిడదవోలు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ..
నిడదవోలు పట్టణ అభివృద్ధికి 11 నెలల కాలంలో రూ. 105.80 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. తద్వారా నిడదవోలుకు గోదావరి జలాలు, ఆర్వోబీ పనులు, ఆస్పత్రి ఆధునికీకరణ తదితర పనులకు ఖర్చు చేస్తున్నామన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.4.50 కోట్లను తీసుకువచ్చామని దుర్గేష్ తెలిపారు. ఆ నిధులతో వ్యర్థాల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, డ్రెయిన్స్ శుభ్రతకు వినియోగిస్తున్నామన్నారు. రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ద్వారా ప్రత్యేకించి రుడా ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో మాట్లాడి పట్టణానికి కోటి రూపాయల నిధులు మంజూరు చేయించానన్నారు. ఆ నిధులతో రామదాసు స్ట్రీట్ నుంచి యూ షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ యార్డు వరకు రోడ్డు వేసేందుకు వినియోగిస్తామన్నారు. నిడదవోలుకు గోదావరి జలాలు తీసుకొస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాటర్ గ్రిడ్ ద్వారా రూ.83.82 కోట్ల నిధులతో అమృత్ పథకం-2 ద్వారా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణంలో అందరికీ నీళ్లు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ నగర్కు రూ.5.96 కోట్లతో త్రాగునీరు సరఫరా చేస్తామన్నారు. ఏపీ టిడ్కో ఇళ్లకు త్రాగునీరు అందించేందుకు రూ.82 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అమృత్, జలజీవన్ మిషన్ నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ బీపీఎస్కు, ఎల్ఆర్ఎస్ ఫండ్స్ క్రింద రూ.33 లక్షలు వచ్చాయన్నారు. ఆ నిధులతో మురుగుకు చెక్ పెడతామన్నారు. వైఎస్సార్ కాలనీలో అర్బన్ హెల్త్ సెంటర్ ను రూ.35 లక్షలతో పూర్తి చేశామని, పెండింగ్ వర్క్ లను త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో రూ.3 కోట్లను తీసుకువచ్చి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. కోటి విడుదలైనట్లు తెలిపారు. మిగిలిన రూ.2 కోట్ల విడుదల విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో చర్చించానని, త్వరలోనే ఆ నిధులు సమకూరుతాయన్నారు.
బ్యూటిఫికేషన్కు చర్యలు..
నిడదవోలు పట్టణాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో గ్రీన్ కార్పొరేషన్ సహకారంతో నిడదవోలు పట్టణ సుందరీకరణ కార్యక్రమం చేపట్టనున్నామని దుర్గేష్ వెల్లడించారు. తద్వారా పచ్చదనం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపడనున్నాయని తెలిపారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకపాలకు అడ్డుకట్ట వేసేందుకు నిడదవోలు పట్టణ వ్యాప్తంగా దాదాపు 250 సీసీ కెమెరాలు అవసరమవుతాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై ఓఎన్జీసీ, గెయిల్ తదితర కార్పొరేట్ సంస్థలతో చర్చించామని, త్వరలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవానికి సీసీ కెమెరాల ఏర్పాటు సీఎస్ఆర్ పరిధిలోని అంశం కానప్పటికీ తాను ప్రత్యేకంగా నిధులు కోరడంతో వారు ఆమోదం తెలిపారని మంత్రి వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సీసీ కెమోరాలు అందుబాటులోని వస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని మంత్రి తెలిపారు.

‘ వ్యర్థ రహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుతాం. పట్టణంలో సుందరమైన మార్కెడ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. భారీ వర్షాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వచ్చే నీరును డ్రైనేజీ ద్వారా బయటకు పంపేందుకు చర్యలు చేపడతాం. ఈ అంశంపై పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన అనంతరం చర్యలకు అధికారులను ఆదేశించాం. నిడదవోలు పట్టణంలో ఆర్ఓబీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరితగతిన ఆర్ఓబీ పూర్తికి చర్యలు తీసుకుంటాం. మెప్మా వెండర్స్కు సంబంధించిన మార్కెటింగ్ కోసం రూ.40 లక్షలు మంజూరు అయ్యాయి. రూ.1.50 కోట్ల నిధులకు మళ్లీ ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం సౌకర్యాల కొరతతో సమస్యగా మారిన మార్కెట్ షెడ్లను దాదాపు రూ.2 కోట్లతో ఆధునికీకరిస్తాం. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు ప్రత్యేకంగా రూ.3 కోట్లతో నిడదవోలును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ, క్రీడాకారులకు అండగా ఉంటాం. నిడదవోలులో క్రీడా మైదానం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటాం. త్వరలోనే క్రీడా మైదానం మంజూరు అవుతుందని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిడదవోలులోని 30 పడకల ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రిగా ఆధునికీకరణ చేస్తాం’ అని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆపరేషన్ సింధూర్, సైనికులకు మద్దతుగా ఆదివారం నిడదవోలులో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని దుర్గేష్ ప్రకటించారు. ‘దేశం కోసం సైన్యం -సైన్యం కోసం మనం’ అంటూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిడదవోలు పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహిస్తామని తెలిపారు. తద్వారా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందిద్దామని కందుల దుర్గేష్ తెలిపారు.
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!