Foreign Cars Scam: విదేశీ లగ్జరీ కార్ల కుంభకోణంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అహ్మదాబాద్ యూనిట్ అధికారులు హైదరాబాద్ వ్యాపారిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 100 కోట్ల రూపాయల ఈ స్కాంలో సదరు వ్యాపారి కీలకపాత్ర వహించినట్టు సమాచారం. నిందితునికి వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు ఉన్నట్టుగా తెలిసింది.
కాగా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కూడా ఈ కేసులో విచారణ జరపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కేసు వివరాలు అందించాలని డీఆర్ఐ అధికారులకు లేఖ రాయనున్నట్టు సమాచారం.
హైదరాబాద్, ముంబయి, అహ్మదాబాద్, పూణె, బెంగళూరు, ఢిల్లీలోని కొందరు కార్ల వ్యాపారులు ఖరీదైన విదేశీ కార్లు ఇక్కడికి తెప్పించుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాటి విలువ తక్కువగా చూపించి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలను స్వాహా చేసినట్టు డీఆర్ఐ అహ్మదాబాద్ యూనిట్ అధికారులకు సమాచారం అందింది.
Also read: Naa Anveshana: అమ్మాయితో నా అన్వేష్.. ఆటగాడు మళ్లీ రెచ్చిపోయాడు..
హమ్మర్ ఈవీ, క్యాడిలాక్, ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టొయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ తదితర కార్లను అమెరికా, జపాన్ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు.
అయితే, వీటిని నేరుగా మన దేశానికి తెప్పించకుండా ముందుగా దుబాయ్ లేదా శ్రీలంకకు చేర్చేవారు. సాధారణంగా విదేశీ కార్లకు స్టీరింగ్ ఎడమవైపు ఉంటుంది. దుబాయ్ లేదా శ్రీలంకకు చేర్చిన తరువాత విదేశీ కార్ల స్టీరింగ్ ను కుడివైపునకు మార్పించే వారు.
ఆ తరువాత మన దేశానికి తెప్పించుకునేవారు. ఇక్కడకు వచ్చిన తరువాత ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటి విలువను 50శాతం తక్కువ చేసి చూపించేవారు. తద్వారా వాస్తవంగా చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీలో సగం మాత్రమే చెల్లించేవారు. ఇలా దేశవ్యాప్తంగా నిందితులు దాదాపు వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టుగా డీఆర్ఐ అహ్మదాబాద్ యూనిట్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేసి హైదరాబాద్ లో కార్ లాంజ్ పేర షోరూం నడుపుతున్న బషారత్ ఖాన్ ను అరెస్ట్ చేసి అహ్మదాబాద్ కు తరలించారు. బషారత్ ఖాన్ ను జరిపిన విచారణలో అతను ఒక్కడే 7 విదేశీ లగ్జరీ కార్లను తెప్పించి వాటి విలువ తక్కువ చేసి చూపించటం ద్వారా 7 కోట్ల రూపాయల కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టినట్టుగా వెల్లడి కావటం గమనార్హం.
కొనుగోలుదారుల్లో..
ఇక, డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో నిందితుల నుంచి విదేశీ లగ్జరీ కార్లు కొన్నవారిలో బడా బాబులు ఉన్నట్టుగా వెల్లడైందని సమాచారం. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నట్టు తెలియవచ్చింది.
Also read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!
ప్రస్తుతం దీనిపై డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ లో బషారత్ ఖాన్ నుంచి కార్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వివరాలను తెలియ చేయాలంటూ ఆర్టీఏ అధికారులకు ఇప్పటికే లేఖ రాసినట్టుగా తెలిసింది. మిగతా సిటీల్లో ఈ కుంభకోణానికి పాల్పడ్డ వారి నుంచి కార్లను కొన్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలిసింది.
రంగంలోకి ఈడీ..?
కాగా, ఈ కేసులో విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. విదేశీ కార్ల లావాదేవీల్లో మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయాలని నిశ్చయించుకున్న ఈడీ అధికారులు కేసు వివరాలను తెలియ చేయాలంటూ డీఆర్ఐ అధికారులకు లేఖ రాసినట్టుగా సమాచారం.