KTR on Congress: ప్రజాపాలన పేరుతో అధికారంలో వచ్చి ప్రజల్ని అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అంతానికి ఆరంభం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని తాను ఇప్పటివరకు చూడలేదన్నారు.
అనుభవలేమి, మోసం, అత్యాశ, అందినకాడికి దోచుకోవడం అనే లక్షణాలు పుష్కలంగా ఉన్న రేవంత్ సర్కార్ తో తెలంగాణ అభివృద్ధి రెండు దశాబ్దాలు వెనక్కి పోయిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో హైదరాబాద్ లోని నందినగర్ లో మంగళవారం సమావేశం అయ్యారు.
Also read: Anganwadi tenders: ఏది అవాస్తవం.. మేడం?.. ఈ ప్రశ్నలకు బదులేది?
ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతకు అనుగుణంగా ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు చేస్తుందన్నారు.
రైతు భరోసా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడం, ధాన్యం కొనుగోళ్లలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా పార్టీ కార్యచరణ ఉండబోతుందన్నారు.
అంతేకాదు నిరుద్యోగులకు మాట ఇచ్చినట్టుగా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో పాటు ఇటీవల వెలుగుచూసిన ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర వ్యూహంతో ప్రజా ఉద్యమాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాల్ని, అవినీతిని ప్రజల్లో బయటపెడతామన్నారు. ప్రజలను మోసం చేస్తూ, వేధిస్తుంటే ఊరుకోబోమన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటాలకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
Also read: Congress Women’s wing: లిస్ట్ ఇచ్చినా నో యూజ్.. నామినేటెడ్ పదవులపై మహిళా నేతలు ఫైర్..
రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ సభగా ఎల్కతుర్తి మీటింగ్ నిలిచిపోతుందన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ కార్యకర్తకు, నేతకు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్కతుర్తి బహిరంగ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల దిశ మారిందని స్పష్టం చేశారు.
ఇప్పుడైనా, ఎప్పుడైనా రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువు బీఆర్ఎస్సేఅన్నారు. సభ తరువాత ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఓ పాజిటివ్ ఎనర్జీ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసే ఉత్సాహం కలిగిందన్నారు. అనంతరం నేతలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.