Operation Sindoor: సరిహద్దుల్లో దాయాది దేశం పాక్ చేస్తున్న దాడులను సైన్యం గట్టిగా తిప్పికొడుతోంది. మే 8 నుంచి ఇప్పటివరకూ పాక్ లోని 11 స్థావరాలపై భారత వైమానిక దళం కచ్చితత్వమైన సమన్వయంతో దాడులు చేశాయి. ఈ దాడి వల్ల పాక్ కు కలిగిన నష్టం చాలా విస్తృతంగా ఉందని ఇండియన్ ఆర్మీ (Indian Army).. శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో వెల్లడించింది. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసం
భారత సైన్యం శనివారం ఉదయం పాక్ వైమానిక స్థావరాలతో పాటు సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో పాక్ ఆయుధ డిపోలు, రక్షణ సామగ్రి ధ్వంసమైనట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం చేసిన దాడిలో పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో చాక్లాలా లేదా నూర్ ఖాన్ ఎయిర్బేస్ ధ్వంసమైంది. అలాగే ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన కరాచీ-హైదరాబాద్ మధ్యలో ఉండే సుక్కూర్ ఎయిర్బేస్తో పాటు చునియాన్, మురీద్, రహీమ్ యార్ ఖాన్, రఫీకీ, పస్రూర్, సియాల్కోట్ సర్గోదా, బోలాది, షాబాద్ తదితర 11 కీలకమైన పాక్ స్థావరాలను భారత వైమానిక దళం నాశనం చేసింది.
అరగంటలో 5 టార్గెట్లు
భారత వైమానిక దళం చేసిన దాడులకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. పాక్ కు ఎంతో కీలకమైన ఐదు వైమానిక స్థావరాలను ఐఏఎఫ్ కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే ధ్వంసం చేసింది. నూర్ ఖాన్, సర్గోదా, బొలాది, షాబాద్ వైమానిక స్థావరాలతో పాటు రహీం యూర్ ఖాన్ విమానాశ్రయాన్ని నిమిషాల వ్యవధిలోనే నాశనం చేసినట్లు సమాచారం. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరిపి పాక్ ను వైమానిక దళం వణికించింది. అయితే రావల్పిండిలోని చాక్లాలా ఎయిర్ బేస్ ఇన్నాళ్లు పాక్ కు అత్యంత కీలకంగా ఉంటూ వస్తోంది. భారత్ పైకి ప్రయోగించిన ఆత్మాహుతి డ్రోన్లలో చాలా వాటిని ఆ వైమానిక స్థావరం నుంచే పాక్ కంట్రోల్ చేసింది. ఐఏఎఫ్ దానిని ధ్వంసం చేయడం పాక్ కు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు.
Also Read: Telangana Rains: ఇదేం క్లైమేట్ భయ్యా.. పగలు ఎండ, రాత్రి వాన.. వచ్చే 3 రోజులు మాత్రం!
ధ్వంసమైన ఆ స్థావరాల ప్రాముఖ్యత
భారత్ ధ్వంసం చేసిన చాక్లాలా లేదా నూర్ ఖాన్ ఎయిర్ బేస్.. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోనే ఉంది. ఈ ఎయిర్ బేస్ రాజకీయంగా, సైనిక పరంగా సున్నితమైంది. ప్రధాని సహా వీఐపీల ప్రైవేట్ జెట్లు అక్కడి నుంచే ప్రయాణించడం గమనార్హం. అలాగే మురీద్ బాద్ ఎయిర్బేస్ కూడా పాక్ కు చాలా కీలకమైంది. షాహ్పర్-1, బాయ్క్త్రార్ టీబీ2 వంటి అత్యాధునిక యూఏవీ, యూసీఏవీ డ్రోన్లను ఈ బేస్ నుంచే పాక్ ప్రయోగించింది. ఇక రఫీకీ ఎయిర్బేస్ విషయానికి వస్తే జేఎఫ్-17 యుద్ధ విమానాలు, మిరాజ్ పైటర్ జెట్లు, సైన్యాన్ని తరలించే హెలికాప్టర్లకు ఈ బేస్ పెట్టింది పేరు. భారత్పై వాడిన జేఎఫ్-17 యుద్ధ విమానాలను ఇక్కడి నుంచే పాక్ ప్రయోగించింది. రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ పై దాడి చేయడం ద్వారా పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ మిలిటరీ సామాగ్రి, ఆయుధాల గిడ్డంగిని ధ్వంసం చేసినట్లైంది. మెుత్తంగా 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాక్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.