GHMC: చారిత్రక గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ఈ సారి కాస్త ముందుగానే శిథిల భవనాలపై ఫోకస్ చేసింది. రానున్న వర్షాకాలం శిథిలా భవనాలు కూలి ఎలాంటి ప్రాణ నష్టం జరగరాదన్న ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసీ కాస్త ముందుగానే దృష్టి సారించింది. పైగా గ్లోబల్ వార్మింగ్ తో పాటు వాతావరణంలో తరుచూ చోటుచేసుకుంటున్నమార్పుల కారణంగా ఎపుడు అకాల వర్షాలు కురుస్తాయో తెలియని కారణంగా జీహెచ్ఎంసీ ఈ సంవత్సరం కాస్త ముందుగానే మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసింది.
ఇప్పటికే అకాల వర్షాల కారణంగా వర్షం సహాయక చర్యల కోసం ఒక్కో వార్డుకు మూడు స్పెషల్ మాన్సూన్ టీమ్ లను సిద్దం చేసిన జీహెచ్ఎంసీ ఇపుడు శిథిలావస్థలోనున్న భవనాలపై దృష్టి పెట్టింది. సర్కిళ్ల వారీగా శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించాలని కమిషనర్ ఆర్. వి. కర్ణన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రత్యేక సర్వేలు నిర్వహించి శిథిల భవనాలు, కట్టడాలు, పాత ప్రహరీ గోడలు మొదలైన వాటిని గుర్తించాలని, గుర్తించిన భవనాలపై ఇంజనీరింగ్ విభాగం వాటి స్ట్రక్చరల్ స్టెబిలిటీని అంచనావేసి నివేదికలను సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు
Also Read: CM Revanth Reddy: దేశమంతా ఒక్కటిగా నిలిచి ఉగ్రవాదాన్ని కూల్చేద్దాం.. సీఎం పిలుపు!.
ఈ నివేదిక ఆధారంగా వాటికి పటిష్టపు చర్యలు చేపట్టాలా? లేక వానాకాలం ప్రాణ నష్టం జరిగేందుకు కారణమయ్యే భవనాలను గుర్తించి, నేలమట్టం చేయాలా? అన్న వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంటుందని కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రాథమికంగా గుర్తించిన భవనాలకు సంబంధించి, అందులో నివాసమున్న వారికి, లేని పక్షంలో యజమాని వివరాలు తెల్సుకుని మరీ నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వింగ్ అధికారులు తమ సర్వేలో సర్కారు పాఠశాల భవనాలను గుర్తిసే వెంటనే ఆ జిల్లా విద్యా శాఖకు సమాచారమివ్వాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రమాదకరంగా మారిన భవనాలపై..
శిథిలావస్థలోనున్న భవనాల గుర్తింపునకు ప్రత్యేక సర్వే నిర్వహించనున్న జీహెచ్ఎంసీ అధికారులకు తమ పరిశీలనలో ప్రమాదకరంగా మారిన భవనాలను గుర్తిస్తే వెంటనే ఖాళీ చేయించడం లేదా సీల్ వేయాలని, భవనాల చుట్టూ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. భవన యజమానులు ఆ భవనం పటిష్టత కోసం మరమ్మత్తులు చేపడితే, అవి జీహెచ్ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో? లేదో? నిర్ధారించాలని, ఈ విషయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ ఆదేశించారు.
త్వరలోనే శిథిల భవనాల కూల్చివేతకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ప్రతి భవనం వివరాలను గూగుల్ స్ప్రెడ్ షీట్లో అప్డేట్ చేయాలని, నివేదికను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. అన్ని సర్కిళ్ల డిప్యూటీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ లు తక్షణమే చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఈ మాత్రం జాప్యం చేయకుండా వీలైనం త్వరగా స్ట్రక్చరల్ స్టెబిలిటీపై నివేదిక అందజేయాలని ఆదేశించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కదిలిన కలెక్టర్లు.. కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశాలు జారీ!
జోనల్ కమిషనర్లు తమ సర్కిళ్లలో ఈ ప్రక్రియను సమీక్షించి నిర్దేశిత గడువులో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శిధిలావస్థ భవనాలు స్ట్రక్చర్ల పై నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన, నివేదికల సమర్పణలో జాప్యం జరిగినా, సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా కమిషనర్ అల్టిమేటం జారీ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు