Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఉగ్ర స్థావరాలపై మన సైన్యం జరిపిన దాడిలో దాదాపు 80 పైగా ముష్కరులు చనిపోయినట్లు సమాచారం. పాక్ లోని జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) ప్రధాన కార్యాలయంపైనా భారత్ క్షిపణులతో విరుచుకు పడటంతో దాని అధినేత మసూద్ అజార్ చనిపోయి ఉంటారని అంతా భావించారు. అయితే ఈ దాడిలో మసూద్ చనిపోలేదని తెలుస్తోంది. కానీ మసూద్ కు పెద్ద మెుత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
మసూద్ కు భారీ దెబ్బ
మంగళవారం అర్ధరాత్రి భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో మౌలానా మసూద్ అజర్ (Masood Azhar) కుటుంబానికి చెందిన 10మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అలాగే నలుగురు సన్నిహిత అనుచరులు సైతం మరణించినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ (PTI) ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ విషయాన్ని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ స్వయంగా వెల్లడించినట్లు స్పష్టం చేసింది.
నేను పోయుంటే బాగుండేది: మసూద్
పాకిస్థాన్లోని బహావల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీద్ సుభాన్ అల్లాపై భారత సైన్యం క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో మరణించిన వారిలో తన పెద్ద సోదరి, ఆమె భర్త, ఒక మేనల్లుడు, అతని భార్య, ఒక మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు ఉన్నారని అజార్ ఒక ప్రకటనలో చెప్పాడని సమాచారం. ఈ మరణాన్ని ఉద్దేశిస్తూ తన కుటుంబ సభ్యులు సంతోషాన్ని పొందారని మసూద్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వారిలో తాను ఉంటే బాగుండేదని మసూద్ అజార్ అన్నట్లు సమాచారం.
దాడి వీడియో రిలీజ్
ఇదిలా ఉంటే పాక్ లోని ఉగ్రసంస్థలపై జరిపిన క్షిపణి దాడుల వీడియోను భారత సైన్యం ఎక్స్ వేదికగా పంచుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దుకు 13 కి.మీ దూరంలోని అబ్బాస్ టెర్రరిస్ట్ క్యాంప్ పై చేసిన దాడి వీడియోను పోస్ట్ చేసింది. అక్కడ లష్కర్ – ఎ – తోయిబా (Lashkar-e-Taiba) అనే ఉగ్ర సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్స్ శిక్షణ పొందుతున్నట్లు ఇండియన్ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ ఫర్మేషన్ తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి 1.04 గం.ల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. 50 మందికి పైగా ఉగ్రవాదుల శిక్షణ కొరకు ఆ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.
OPERATION SINDOOR#JusticeServed
Target 1 – Abbas Terrorist Camp at Kotli.
Distance – 13 Km from Line of Control (POJK).
Nerve Centre for training suicide bombers of Lashkar-e-Taiba (LeT).
Key training infrastructure for over 50 terrorists.DESTROYED AT 1.04 AM on 07 May 2025.… pic.twitter.com/OBF4gTNA8q
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 7, 2025