Hyderabad Crime: మద్యం సేవించ వద్దని చెప్పిన పాపానికి బావను హత్య చేసిన బావమరిది ఉదంతమిది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ హత్య బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మాసాబ్ ట్యాంక్ నివాసి వాహెద్ తన ఇద్దరు కుమారులు గౌస్, సత్తార్ లతో కలిసి చికెన్ షాప్ నడుపుతున్నాడు. కాగా, సత్తార్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో డబ్బు కోసం తరచూ తండ్రి, సోదరునితో గొడవలు పడటం మొదలు పెట్టాడు.
కాగా, వాహెద్ అల్లుడు ఇలియాస్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఫస్ట్ లాన్సర్ లో ఉంటున్నాడు. మంచి మాటలు చెప్పి సత్తార్ తో మద్యం మానిపించాలని ఇలియాస్ పలుమార్లు ప్రయత్నించాడు. అయినా, సత్తార్ లో మార్పు రాకపోవటంతో డబ్బు ఇవ్వకండని మామ వాహెద్, మరో బావమరిది గౌస్ లతో చెప్పాడు. దాంతో సత్తార్ అతనిపై కక్ష పెంచుకున్నాడు.
రాత్రి సత్తార్ మద్యం కొనటానికి డబ్బు ఇవ్వమని తండ్రి, సోదరునితో గొడవ పడగా జోక్యం చేసుకున్న ఇలియాస్ డబ్బు ఇచ్చేది లేదన్నాడు. దాంతో చికెన్ షాప్ కు వెళ్లి కత్తి తీసుకు వచ్చిన సత్తార్ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఇలియాస్ అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సత్తార్ ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు