తెలంగాణ: Nepali workers Robbery: నమ్మి పనిలో పెట్టుకుంటే ఇంటి యజమానిని లూటీ చేశారు నేపాలీ నౌకర్లు. యజమానులకు మత్తు మందు ఇచ్చి స్పృహ తప్పించి ఇంట్లో ఉన్న 2 కిలోల బంగారు నగలు, 3 కోట్ల రూపాయల నగదుతో ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాగ్ లింగంపల్లి ప్రాంత నివాసి హేమరాజ్ వ్యాపారి. కాగా, కొన్నిరోజుల క్రితం నేపాల్ దేశానికి చెందిన వారు ఆయన ఇంట్లో పనికి కుదిరారు.
వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, పోలీసులతో వెరిఫై చేయించకుండా హేమరాజ్ ఉద్యోగాలు ఇచ్చాడు. కాగా, వ్యాపార లావాదేవీల్లో భాగంగా వచ్చే డబ్బును హేమరాజ్ ఇంటికి తెచ్చి భద్రపరుస్తుండటాన్ని నౌకర్లు గమనించారు. ఈ క్రమంలో దొంగతనానికి పథకం వేశారు. దీని ప్రకారం సోమవారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపి హేమరాజ్ అతని భార్యకు ఇచ్చారు.
Also Read: Lady Aghori Arrested: అఘోరీకి బిగ్ షాక్.. అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఎందుకంటే?
అది తిన్న ఇద్దరు స్పృహ కోల్పోయారు. అదే అవకాశంగా నేపాలీ నౌకర్లు లాకర్లు తెరిచి 2 కిలోల బంగారు ఆభరణాలు, 3 కోట్ల రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. ప్రతీరోజూ మార్నింగ్ వాక్ కు వచ్చే హేమరాజ్ ఉదయం రాకపోవటంతో ఆయన స్నేహితుడు ఇంటికి వచ్చాడు. చూడగా హేమరాజ్ దంపతులు స్పృహ లేని స్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించిన ఆయన హేమరాజ్ కుమారునికి సమాచారం అందించాడు.
ఈ క్రమంలో ఇంటికి వచ్చిన హేమరాజ్ కుమారుడు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా అనుమానితుల ఫోటోలను సేకరించారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.