Hydra demolition: హైదరాబాద్ నగరంలో మరోమారు హైడ్రా కూల్చివేతలు సంచలనం సృష్టించాయి. టీడీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూముల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేశారు. హఫీజ్పేటలోని వందల కోట్ల భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రా అధికారులు వాటిని కూల్చి వేశారు. ఈ భూముల వివాదం కేసు కోర్టులో ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో అక్కడి నిర్మాణాలను కూల్చివేసి హైడ్రా తన పేరిట బోర్డులు పెట్టింది.
హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాల భూమి ఉంది. అందులో 35 ఎకరాలు టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన వసంత హౌస్ సంస్థ ఆధీనంలో ఉంది. కొంతభాగంలో విల్లాలు, అపార్ట్ మెంట్లు సైతం ఉన్నాయి. అయితే ఈ భూమి ప్రభుత్వానిదేనని హైడ్రా ఆరోపిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీ కృష్ణకు చెందిన కేఎంకే సంస్థ భారీ షెడ్డులు నిర్మించింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు. అందులోనే ఎమ్మెల్యే వసంత కృష్ణకు సంబంధించిన కార్యాలయం సైతం ఉంది.
హైడ్రా ఏం చెప్పిందంటే
హఫీజ్ పేటలో కూల్చివేతలకు సంబంధించి హైడ్రా అధికారులు స్పందించారు. వసంత హౌస్ నిర్మాణ సంస్థ ఆఫీసు కార్యాలయం, షెడ్లను ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకు ఇచ్చినట్లు హైడ్రా వివరించింది. సుప్రీంకోర్టులో చాలా కాలంగా కేసు నడుస్తోందని కోర్టు ఆదేశాలను దిక్కరిస్తూ ఈ నిర్మాణాలను చేపట్టి అద్దెకు ఇచ్చారని హైడ్రా తెలిపింది. ప్రహారితో పాటు లోపలి నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసినట్లు హైడ్రా ప్రకటించింది.
Also Read: Case on Aghori: అఘోరీకి బిగ్ షాక్.. రంగంలోకి దళిత సంఘాలు.. అరెస్టు ఖాయమేనా!
వసంత ఏమన్నారంటే
మరోవైపు హైడ్రా కూల్చివేతలపై టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. ఆ స్థలాన్ని 2005లోనే కొనుగోలు చేశానన్న ఆయన.. రెగ్యులరైజేషన్ కూడా చేయించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని 20 ఏళ్లు అవుతోందని.. ఆ భూమిపై ఎలాంటి కేసులు కూడా లేవని కొట్టిపారేశారు. ఇటీవలే హైడ్రా నుంచి నోటీసులు వచ్చాయని.. రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ చూపించానని అన్నారు. సీఎం రేవంత్ జపాన్ టూర్ లో ఉన్నప్పుడు హైడ్రా ఇలా రెచ్చిపోవడం కరెక్ట్ కాదని అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.