Ontimitta Temple: ఏకశిలానగరం ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవం జరగనుంది. ఘనంగా సీతారాముల కల్యాణ వేడుక జరగనుంది. ఇందుకోసం ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం ముస్తామైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆలయంలో ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియా సమావేశం నిర్వమించారు.
నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామ కళ్యాణోత్సవ వేడుకలు జరిగాయని చెప్పారు. ఏకంగా 2,500 మంది టీటీడీ సిబ్బందితో ఏర్పాట్లు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. జర్మన్ షెడ్ డిజైన్తో కళ్యాణ వేదికను నిర్మించామని తెలిపారు. ‘‘సీతారామ కళ్యాణానికి లక్ష మంది భక్తులు రావొచ్చని అంచనా వేస్తున్నాం. 130 సీసీ కెమెరాల సర్క్యూట్, 7 డ్రోన్లతో భద్రతను సమీక్షిస్తున్నాం.
Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!
రాజంపేట, కడప నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని భక్తులకు కల్పిస్తున్నాం. అన్ని మౌలిక వసతుల రూపకల్పనలో రాజీలేని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా పుష్పాలంకరణను తీర్చి దిద్దుతున్నాం. పారిశుద్ధ్యం, త్రాగునీరు, అన్నప్రసాదం లాంటి వసతులను మునుపెన్నడూ లేని రీతిలో సమకూర్చాం’’ అని బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీ కోదండ రామ స్వామి కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు, శ్రీవారి సేవకులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Also Read; Sama Rammohan:హెచ్ సీయూ రగడ.. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సరికొత్త సవాల్!
అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్యాలరీలలో ఉండే భక్తులకుకల్యాణ తలంబ్రాలు, స్వామి వారి ప్రసాదం, అన్నప్రసాదాలను క్రమపద్ధతిలో అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వాహనాల పార్కింగ్, గ్యాలరీలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణలో క్రమపద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వామివారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈ సందర్భంగా శ్యామల రావు చెప్పారు.
స్వామి వారి మీద భక్తితో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల సంయమనంతో వ్యవహరించాలని పోలీసులను ఆయన కోరారు. గ్యాలరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు, ఇతర శాఖల టీటీడీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
350 ఎయిర్ కూలర్లు ఏర్పాటు
ఇవాళ (ఏప్రిల్ 11) సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు సీతారామ కల్యాణం జరగనుంది. భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రధాన ఆలయానికి సమీపంలో రెండు, కల్యాణ వేదిక లోపల, చుట్టుపక్కల 23 ఎల్ఈడీ స్క్రీన్లను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ ఆడియో కోసం, లైన్ అర్రే సౌండ్ మెకానిజంతో రేడియో, బ్రాడ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించేందుకు దాదాపు 350 ఎయిర్ కూలర్లను కూడా ఏర్పాటు చేశారు. కల్యాణ వేదిక ప్రధాన వేదికపై కూడా ఏసీ, ఎయిర్ కూలర్లను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇక ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేక శోభను సంతరించుకుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఎలక్ట్రికల్, గార్డెన్ విభాగాలు చేపట్టిన పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ సముదాయం, కళ్యాణ వేదిక వద్ద అద్భుతమైన ట్రస్ లైటింగ్తో ఏర్పాటు చేశారు.
దేవాలయం, కల్యాణ వేదికలను కలుపుతూ రహదారుల వద్ద వివిధ దేవతామూర్తులతో కూడిన 10 పెద్ద, 30 చిన్న విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మీ వెంకటేశ్వర, సీతారామ, శ్రీరామ పట్టాభిషేకం, మహా విష్ణువు, విశ్వరూపం, దశావతారాలు వంటి పెద్ద కటౌట్లు ఉన్నాయి. అష్టలక్ష్ములు తుంబురుడు అన్నమాచార్యులు వంటి చిన్న కటౌట్లు ఏర్పాటు చేశారు.
గోపురం దీపాలంకరణ, ప్రాకారం చుట్టుపక్కల దీపాలంకరణ, శ్రీవేంకటేశ్వర స్వామి త్రీ డైమెన్షనల్ దీపాలంకరణ, ఆలయం వద్ద ఒకటి, కల్యాణ వేదిక వద్ద మరొకటి విద్యుత్ డైమండ్ కిరీటాల నమూనా భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దాదాపు 100 మంది కార్మికులు ఈ విద్యుత్ అలంకారాలను తయారు చేయడానికి నెల రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు.
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన గురువారం ఉదయం జగన్మోహనాకారుడిగా రాములవారు దర్శనమిచ్చారు. ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది.
కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో ఆలయ డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్ప్టెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు