Drug Mafia In Dhoolpet: ధూల్ పేట్ కేంద్రంగా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న గంజాయి దందాపై ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు నిరంతర దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో 250 రోజుల్లో 425మంది నిం దితులపై 102 కేసులు నమోదు చేశారు. వీరి నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల్లో 327మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైళ్లకు రిమాండ్ చేశారు. పరారీలో ఉన్న మిగితా వారి కోసం గాలిస్తున్నారు. ఒడిషాతోపాటు ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి గంజాయి తెప్పిస్తున్న కొందరు ధూల్ పేట్ వ్యాపారులు దానిని నగరంలో విక్రయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనిని అడ్డుకోవటానికి ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జూలై 17 నుంచి ఆపరేషన్ ధూల్ పేట్ ప్రారంభించారు.
Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!
పూర్తిగా నిర్మూలించే వరకు...
ధూల్ పేట్ లో గంజాయి దందాను పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకు ఆపరేషన్ ను కొనసాగిస్తామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వీ.బీ.కమలాసన్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన 102 కేసుల్లో 58 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాంతోపాటు 147 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్టు తెలిపారు.
13మంది నిందితులను బైండోవర్ చేశామని, పరారీలో ఉన్న 85మంది నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు. ధూల్ పేట్ కు చెందిన కొందరు గంజాయి వ్యాపారులు నగరంలోని ఇతర ప్రాంతాలకు దందాను విస్తరించారని తెలిపారు. ఆయా చోట్ల కూడా దాడులు చేస్తూ నిందితులను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్టుగా గంజాయి, డ్రగ్స్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను పూర్తి స్థాయిలో అరికట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు