chilukur balaji temple: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈనెల 14 వరకు జరగనున్నాయి. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచి..భక్తుల కొంగు బంగారంగా చిలుకూరు బాలాజీ ఆలయం విరాజిల్లుతోంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. ఆలయానికి రంగులు వేయిస్తుండడంతో కొత్త కళను సంతరించుకుంది. వివిధ సేవలకు సంబంధించిన వాహనాలను సిద్దం చేసి ఉంచారు. భక్తులకు వసతుల పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రహ్మోత్సవాలు ఇలా..
బ్రహ్మోత్సవాల మొదటి రోజు సోమవారం సెల్వర్ కూత్తుతో ఉత్సవాలకు అంకరార్పణ జరుగుతుంది. 8న ధ్వజారోహణం, శేష వాహన సేవలు, 9న గోపవాహన, హనుమంత వాహన సేవ, 10న సూర్యప్రభ, గరుడ వాహన సేవలు, 11న వసంతోత్సవం, గజవాహన సేవ, 12న పల్లకీ సేవ, అర్థరాత్రి దివ్య రథోత్సవం, 13న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దోప్, పుష్పాంజలి సేవలు. 14న చక్రతీర్థం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
Also read: Case on Harsha Kumar: పాస్టర్ ది హత్య అంటూ ఆరోపణ.. హర్షకుమార్పై కేసు నమోదు!
ఈసారి గరుడ ప్రసాదం లేనట్లే
బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం అనంతరం గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా వితరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే గత యేడాది గరుడ ప్రసాదం కోసం పెద్ద సంఖ్యలో మహిళలు రావడంతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ట్రాఫిక్కు అంతరాయం సైతం కలిగింది. ఈ నేపథ్యంలో ఈసారి గరుడ ప్రసాదం పంపిణీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.