గరివిడి స్వేచ్ఛ: Vijayanagaram Crime: ఇటీవల విశాఖపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని యువతిపై, పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో ఆమె తల్లిపైనా పట్టపగలు ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా గడువక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో కోండ్రు అఖిల (18) అనే యువతిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇంట్లో వాళ్లంతా పనికి వెళ్లిన సమయంలో, మొహానికి మంకీ క్యాప్ ధరించి యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. యువతి వంట గదిలో పనిచేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చి పొట్టపై రెండు చోట్ల బలంగా పొడిచాడు.
దాడి తర్వాత దుండగుడు ఇంటి వెనుక తలుపు నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంటబడినప్పటికీ అతడు చిక్కకుండా పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్న అఖిలను ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చిపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా స్థలానికి ఎస్పీ
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు అఖిలను దుండగుడు రెండు సార్లు కత్తితో పొడిచినట్టు ఆయన వెల్లడించారు. వంట గదిలో వంట చేస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటోందని వివరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వకుల్ జిందాల్ వివరించారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.
Also Read: Online Betting: బెట్టింగ్ మరణాలు ఇక ఆగవా? రైలుకు ఎదురెళ్లి మరీ.. యువకుడు ఆత్మహత్య..
త్వరలోనే కేసును ఛేదిస్తామని, నిందితుడిని చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక చెబుతామన్నారు. ఇది ప్రేమోన్మాది దాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్య బంధువు ఒకరు మాట్లాడుతూ, యువతి అమ్మానాన్న, తాము పనికి వెళ్లామని చెప్పారు. చుట్టుపక్కల వారు ఫోన్చేబితే విషయం తెలిసిందన్నారు. ప్రేమవ్యవహారాలు ఏమీలేవని తెలిపారు. కాగా, బాధిత యువతి అఖిలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు: వైసీపీ
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, గత 10 నెలల నుంచి రాష్ట్రంలో ఏదో ఒక చోట దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) విమర్శించారు. ఈ దాడులు ఆగాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చేతగానితనాన్ని అలుసుగా తీసుకుని, రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలపై దుండగులు అఘాయిత్యాలు, దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న అఖిలను పరామర్శించి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50,000 ఆర్థిక సాయం కూడా అందించారు. యువతికి అన్ని విధాలుగా తోడుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/