Hyd Local Body Elections: తెలంగాణలో ఎన్నికల సెగ రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో ఓ ఎమ్మెల్సీ (MLC) స్థానానికి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నేటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా. బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) పార్టీల నుంచి మాత్రమే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికకు అధికార కాంగ్రెస్ తో పార్టీ విపక్ష బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఏర్పడింది.
నామినేషన్లు దాఖలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీ నుంచి అభ్యర్థిగా గౌతం రావు (Goutham Rao) నామినేషన్ దాకలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Chinthala Ramachandra Reddy), బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు వెళ్లి సాక్షి సంతకాలు చేశారు. మరోవైపు ఎంఐఎం పార్టీ (All India Majlis-e-Ittehadul Muslimeen) నుంచి కూడా ఓ నామినేషన్ దాఖలైంది. ఆ పార్టీ తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ (Mirza Riyaz Ul Hassan Effendi) నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి ఇప్పటివరకూ ఎలాంటి నామినేషన్ రాలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని విపక్ష బీఆర్ఎస్ నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాటల యుద్ధం షురూ!
లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రధానంగా ఎంఐఎం – బీజేపీ మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఉప్పు – నిప్పులా ఉండే ఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పోరు జరగనుండటంతో సహజంగానే రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్సీ స్థానం కోసం ఈ రెండు పార్టీలు పరస్పరం ఎలాంటి విమర్శల దాడికి దిగుతాయోనన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
ఎంఐఎం గెలుపు ఖాయమేనా!
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ముందే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎంఐఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఎంఐఎం అభ్యర్థి విజయం.. ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీజేపీ.. తమ పార్టీ తరపున గౌతం రావును రంగంలోకి దింపింది. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది.
Also Read: SRH Fans: ‘300 సరే మ్యాచ్ గెలవాలిగా.. ఇలాగే ఆడితే చాప చుట్టేస్తారు’.. సన్ రైజర్స్ పై ఫ్యాన్స్ ఫైర్
ఎన్నికలు ఎప్పుడంటే?
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి గతంలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏప్రిల్ 9 వరకూ నామినేషన్ ఉపసంహరణకు అనుమతిస్తారు. ఏప్రిల్ 23న పోలింగ్ ఉండనుంది. రెండ్రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఈసీ ప్రకటించింది. కాగా మే 1న ఎమ్మెల్సీ ప్రభాకర్ (MLC Prabhakar) పదవీకాలం ముగియనుండటంతో ఈసీ (EC) ఈ మేరకు ఎన్నికలు నిర్వహించ తలపెట్టింది. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఐదు స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. ఇందులో అధికార పార్టీకి సంబంధించి నలుగురు, విపక్ష బీఆర్ఎస్ కు సంబంధించి ఒకరు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవమయ్యారు.