Mahabubnagar District: ఆప్షన్ల ద్వారా రెవెన్యూ శాఖ లోకి వస్తున్న జీపీవో (గ్రామ పరిపాలన అధికారి)లు సర్వీసుపరమైన అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం అవుతుందన్నారు. గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరిగింది. సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆప్షన్ల ద్వారా నియామకం అవుతున్న జీపీవోలందరికీ కామన్ సర్వీస్ ఉంటుందన్నారు.
అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వచ్చిట్లుగానే ప్రతి జీపీవో కు పదోన్నతులు ఉంటాయన్నారు. ప్రజా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో రైతులకు మెరుగైన సేవలు అందడంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులకు భారీ ఎత్తున పదోన్నతులు వస్తున్నాయన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున గ్రామ పరిపాలన అధికారులను నియామకం చేయడం వలన రైతులకు రెవెన్యూ సేవలు చెరువ కావడంతో పాటు రెవెన్యూ శాఖ ఉద్యోగులకు పెద్ద ఎత్తున పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. దీంతో క్రమంగా రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.
అయితే భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు రెవెన్యూ ఉద్యోగులు పునరంకితం కావాలన్నారు. భూ భారతి చట్టంతో రెవెన్యూ శాఖ బలోపేతం కావడంతో పాటు రైతులకు గ్రామ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం ఆవుతాయన్నారు. గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం 10,954 మంది గ్రామ పాలన అధికారులను వ్యక్తిగత ఆప్షన్ల ద్వారా నియామకం చేస్తుందన్నారు. రెవెన్యూ ఉద్యోగుల ఆకాంక్షకు ప్రభుత్వ సహకారం తోడవడంతో రెవెన్యూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాదించుకున్నామన్నారు. అయితే రాష్ట్రంలో లబ్ధిదారులకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందించేందుకు రెవెన్యూ ఉద్యోగులు అత్యంత బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.
ప్రభుత్వ సహకారంతో దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాదించామన్నారు. అలాగే గతంలో ధరణిలో తహశీల్దార్లకు, ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాలు లేని కారణంగా రైతుల సమస్యలు సత్వరం పరిష్కరించే పరిస్థితి లేదన్నారు. కానీ త్వరలోనే అమల్లోకి రాబోతున్న భూ భారతి చట్టంలో తహశీల్దార్లకు ఆర్డీఓలకు, అడిషనల్ కలెక్టర్లకు అధికారాల వికేంద్రీకరణ జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రాష్ట్ర రాజధానిలోని సీసీఎల్ఏ నుండి గ్రామ పరిపాలన అధికారి వరకు అధికారాల వికేంద్రీకరణ జరగడంతో భూ సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయన్నారు. జీపీవోల వలన రైతులకు గ్రామ స్థాయిలో సేవలు అందడంతో పాటు సత్వర సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు.
ప్రజా పాలనలో ప్రభుత్వం ఒకవైపు రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేస్తూనే… మరోవైపు రైతులకు, ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలను క్షేత్రస్థాయిలోనే అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. నాడు రైతులకు, ప్రజలకు దూరాభారమైన రెవెన్యూ సేవలు త్వరలోనే గ్రామ స్థాయిలోనే అందుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు, రాష్ట్ర మంత్రివర్గం, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ గారు మరియు ప్రభుత్వ పెద్దల, ఉన్నతాధికారుల అందరి సహకారంతో అనతి కాలంలోనే అనేక చారిత్రిక విజయాలను తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సొంతం చేసుకోవడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కొండంత అండగా నిలిచిన ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉందన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అనేక విజయాలు సాధించి రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు.
క్షేత్రస్థాయికి రెవెన్యూ సేవలు..
వాస్తవానికి గతంలో తెలంగాణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ గ్రామ సచివాలయ కేంద్రంగా ఉండేదని, భూ రికార్డులు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఉండేవన్నారు. రైతులకు ఏ భూ సమస్య వచ్చినా గ్రామ స్థాయిలోనే పరిష్కారం అయ్యేదని, కానీ ఎన్టీఆర్ ప్రభుత్వంలో రెవెన్యూ పరిపాలన సంస్కరణలతో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను మండల కేంద్రాలకు మార్చారన్నారు. తదనంతరం రాజశేఖర్ రెడ్డి మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించారన్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణలతో ఏకంగా భూ సమస్యల పరిష్కార వేదిక జిల్లా కేంద్రానికి చేరడంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం అన్నారు. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ గ్రామీణ స్థాయి రెవెన్యూ వ్యవస్థ క్రమంగా బలోపేతం అవుతుందని లచ్చిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలు…
దేశ చరిత్రలోనే తొలిసారిగా 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను సాధించడంతో పాటు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సంఖ్యను పెంచడం, గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రామానికో అధికారి చొప్పున 10,954 జీపీవో పోస్టుల ఏర్పాటు మనకు అతిపెద్ద విజయాలుగా లచ్చిరెడ్డి అభివర్ణించారు. అలాగే జీఓ నం.317 రాష్ట్రంలో ఉద్యోగులను చిన్నాభిన్నం చేసిందన్నారు. ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలకు సైతం చెట్టుకొక్కరికి పుట్టకొక్కరికి పోస్టింగ్ లు ఇచ్చారన్నారు. జేఏసీ ఉద్యమ ఫలితంగా ఉద్యోగుల ఆంక్షలను, 317 జీవోలోని నిబంధనలను ప్రభుత్వం సడలించిందన్నారు.
ముఖ్యంగా స్పోజ్, మెడికల్, తదితర కోణాలలో ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిందన్నారు. అలాగే రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలలో పోస్టుల మంజూరు, జూనియర్ అసిస్టెంట్ల నుంచి డిప్యూటీ కలెక్టర్లు వరకు పదోన్నతులు సాధించడం, తహశీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లకు గతంలో కొల్పోయిన అధికారాలను భూభారతి చట్టం-2025తో పునరుద్ధరణ జరిగిందన్నారు. అలాగే ఆప్షన్ల పద్ధతిలో జీపీవో నియామకం చేయడం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ సాధించిన విజయాలన్నారు. అలాగే వేరువేరు జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి సొంత జిల్లాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Also Red: Also Reed: TG Panchayat Raj: గుడ్ న్యూస్.. రైతుల చెంతకే సేంద్రియ ఎరువులు..!
సుమారు 10 ఏళ్ల తర్వాత 330 మందిని అధికారికంగా అవుట్సోర్సింగ్ టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లుగా గుర్తించడం జరిగిందన్నారు. 670 మంది ఫీల్డ్ అండ్ టెక్నికల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రైవేట్ యాజమాన్యం నుండి ప్రభుత్వ కార్పొరేషన్కు బదిలీ చేసేందుకు శాయాశక్తుల కృషి చేస్తున్నామన్నారు. అలాగే 61 సంవత్సరాలు పై బడిన వీఆర్ఏలను సర్దుబాటు చేసి ఆ కుటుంబాలకు న్యాయం చేసేలా, అలాగే కారుణ్య నియామకాలను చేపట్టేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాము. వీటితో పాటు రెవెన్యూ ఉద్యోగులుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మనం కోరుకుంటున్న సంక్షేమం, ఇతర శాఖాపరమైన పదోన్నతులు, బదిలీలు మరియు సీనియారిటీ అంశాల గురించి మనమంతా ఒక చోట కలిసి చర్చించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు.
Also Read: GHMC on Hyderabad Rains: వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. మేయర్ విజయలక్ష్మీ
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకొని మనందరం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సమీప భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించుకుంటామని జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, కోశాధికారి వెంకట్ రెడ్డి, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, టీజీటీఏ మహిళా విభాగం అధ్యక్షురాలు పి. రాధ, సీసీఎల్ఏ అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ చైతన్య, రాంబాబు, కోశాధికారి మల్లేశం, టీజీఆర్ఎస్ఏ మహిళా విభాగం అధ్యక్షులు సుజాత చౌహాన్, టీజీటీఏ ఉపాధ్యక్షులు పాల్ సింగ్, పూర్వపు వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరిక ఉపేందర్ రావు, మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, నారాయణ పేట్ అడిషనల్ కలెక్టర్ బెంజ్ శాలం, ఆర్డీవో ఈ.
నవీన్, డిప్యూటీ కలెక్టర్ అరుణా రెడ్డి,ఉమ్మడి జిల్లా పరిధిలోని తహసీల్దార్లు, టీజీటీఏ ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు గాన్సీరామ్, ఇబ్రహీం, రమేష్ రెడ్డి, జిలానీ, వీరుభద్రప్ప, నరేందర్, శ్రీకాంత్, కృష్ణయ్య, నగర్ కర్నూల్ తబితా, వెంకటేష్, టీజీఆర్ఎస్ఏ నాయకులు శ్రీనివాస్, దేవేందర్, చైతన్య, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మీకాంత్, ప్రశాంత్, రమేష్, రాములు, కరుణాకర్, కిరణ్ కుమార్, బాలరాజు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని రెవెన్యూ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు