HCA SRH Tickets Issue: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) … సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ (SRH) మధ్య తలెత్తిన వివాదంపై విజిలెన్స్ విచారణ షురూ అయ్యింది. ఉప్పల్ స్టేడియంలోని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ కు మంగళవారం ఉదయమే వచ్చిన విజిలెన్స్ అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఐపీఎల్ టోర్నీకి ముందు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను తీసుకున్నారు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచులకు సంబంధించి పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తోందని ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆరోపించిన విషయం తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లిపోతామని హెచ్చరికలు కూడా చేసింది. ఈ మేరకు ఓ మెయిల్ ను విడుదల చేసింది. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టిక్కెట్ల కోసం ఒత్తిడి చేసిన మాట నిజమే అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారుల బృందాలు మంగళవారం ఉదయమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి చేరుకున్నాయి. అప్పటికి అసోసియేషన్ చెందిన ఎవ్వరూ రాలేదు. దాంతో అందుబాటులో ఉన్న సభ్యులంతా రావాలని సూచించిన విజిలెన్స్ అధికారులు ఆఫీస్ లోని కంప్యూటర్ ను పరిశీలించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ మధ్య నడిచిన ఈ మెయిళ్ల వివరాలను తీసుకున్నారు. ఆఫీస్ లోని రికార్డులను పరిశీలించి కొంత సమాచారాన్ని సేకరించారు. తనిఖీలు కొనసాగుతుండగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కొందరు అక్కడికి చేరుకున్నారు. వీరి ద్వారా ఐపీఎల్ టోర్నీ మొదలు కావటానికి ముందు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని విజిలెన్స్ అధికారులు తీసుకున్నారు. గత రెండేళ్లలో ఉప్పల్ స్టేడియంలో జరిపిన రెన్నోవేషన్స్ పనులు, వాటికి అయిన ఖర్చుల వివరాలను కూడా సేకరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కూడా విజిలెన్స్ అధికారులు తీసుకున్నారు.
ఒకవైపు విజిలెన్స్ విచారణ మొదలు కాగా మరోవైపు సమస్యను పరిష్కరించుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది. ఈ క్రమంలో కలిసి కూర్చుని చర్చించుకుందామంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఓ మెయిల్ పంపించింది. ఇప్పటికే కలిసి సమస్యను పరిష్కరించుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పిన విషయం తెలిసిందే. ఇరువైపులా పరిష్కారానికి సిద్దం అన్న సంకేతాలు అందిన నేపథ్యంలో రెండు పక్షాలతో చర్చలు జరపాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం.. బుధవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ తో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకు ఉప్పల్ లో జరిగిన రెండు మ్యాచ్ లకు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. కేవలం 3,800 కాంప్లిమెంటరీ పాస్ లే ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అవి కూడా కోశాధికారి శ్రీనివాస్ కు ఇచ్చారుగానీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు కాదని పేర్కొంది. ఎఫ్ 12ఏ బాక్సులో సామర్థ్యానికి మించి 50 టిక్కెట్లు ఇస్తామని సన్ రైజర్స్ యాజమాన్యం చెప్పిందని తెలిపింది. అయితే, కేవలం 30మంది కూర్చోవటానికి మాత్రమే వీలుండటంతో మిగిలిన 20 పాస్ లను మరో బాక్స్ లో సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలియచేసింది. గతనెల 27న సన్ రైజర్స్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ సురేశ్ దీనికి అంగీకరించినట్టు పేర్కొంది.
Also Read: Smart Ration Cards AP: కొత్త రేషన్ కార్డులపై అదిరిపోయే అప్ డేట్.. ప్రభుత్వం ప్లాన్ మామూల్గా లేదుగా!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రతీ మ్యాచ్ కు 10శాతం టిక్కెట్లు బ్లాక్ చేయమన్నారన్నది నిజం కాదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విజిలెన్స్ అధికారులకు సూచించింది. ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం 10శాతం టిక్కెట్లు బ్లాక్ చేయాలని అడగలేదని స్పష్టం చేసింది. తమ క్లబ్ సెక్రటరీలకు ఉచిత పాస్ లు సరిపోక పోతుండటంతో డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనటానికి అవకాశమివ్వాలని అపెక్స్ కౌన్సిల్ గతనెల 19న కోరిన విషయాన్నిగుర్తు చేసింది. దీనికి సన్ రైజర్స్ యాజమాన్యం అంగీకరించి హెచ్సీఏ అకౌంట్ నుంచి చెల్లింపులు జరపమని అడిగినట్టు తెలిపింది. దీనికి తాము అంగీకరించలేదని పేర్కొంది. టిక్కెట్లు కొన్నవారు వ్యక్తిగతంగా డబ్బు చెల్లిస్తారని స్పష్టంగా చెప్పినట్టు తెలిపింది.
ఈ టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం పెండింగ్ లో ఉండగానే జగన్మోహన్ రావు తన వ్యక్తిగత అవసరాల కోసం 2,500 టిక్కెట్లు బ్లాక్ చేయాలని అడిగినట్టు దురుద్దేశాలు ఆపాదించటం సమంజసం కాదని పేర్కొంది. స్టేడియం ఆధునీకరణ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ సీట్లు వేయించాలని జస్టిస్ నాగేశ్వరరావుని సన్ రైజర్స్ యాజమాన్యం కోరిందని పేర్కొంది. దీని కోసం అయ్యే 8 నుంచి 10కోట్ల ఖర్చును సీఎస్ఆర్ నిధుల కింద చెల్లిస్తామని కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. అయితే, సన్ రైజర్స్ యాజమాన్యం ఈ మాటను నిలబెట్టుకోలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే స్టేడియంలో తాజా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించాలని సన్ నెట్ వర్క్ ఎండీకి లేఖ కూడా రాశామని HCA తెలియచేసింది. దీనిపై సానుకూలంగా స్పందించి స్టేడియానికి రంగులు వేయటం, కార్పోరేట్ బాక్సుల ఆధునీకరణ పనులు మీరు చేపట్టగా కొత్త ఏసీల కొనుగోలు, వాటిని ఏర్పాటు చేయించటం తాము చేసినట్టుగా హెచ్సీఏ తెలిపింది.