రాజమండ్రి, స్వేచ్ఛ:Pastor Praveen Death: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆరు రోజులుగా రాజమండ్రి పోలీసులు, ప్రత్యేక బృందాలు విచారణ చేస్తున్నప్పటికీ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు ఇంకెన్నాళ్లీ విచారణ? అంటూ క్రైస్తవ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో రోజుకో వీడియో బయటికొస్తోంది. దీంతో అసలు ఏది నిజమో? ఏది మార్ఫింగ్ అనేది ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. దీంతో పోలీసులు సైతం తలలు పట్టుకుంటున్నారు.
నిన్న, మొన్న రెండ్రోజులుగా వైన్ షాప్ దగ్గర ఉన్నట్లు, పార్కు బయట కూర్చుని ఉన్న వీడియోలు వైరల్గా మారాయి. అయితే ఈ వీడియోలన్నీ మార్ఫింగ్ అని క్రైస్తవ సంఘాలు కొట్టిపారేస్తున్నారు. సోమవారం నాడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో పెట్రోల్ పట్టించే సమయానికే బైక్ హెడ్లైట్ పగిలిపోయింది. పెట్రోల్ బంక్ సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also read: Narendra Modi: నిస్వార్థ సేవే ఆర్ఎస్ఎస్ లక్ష్యం.. ప్రధాని మోడీ
వీడియోను పరిశీలిస్తే పెట్రోల్ బంకులోనే ప్రవీణ్ బాగా నీరసంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. దీంతో గొల్లపూడి రావడానికి ముందే ఏదైనా ప్రమాదం జరిగిందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ మహానాడు జంక్షన్ సమీపంలో ప్రమాదం జరిగిందని స్థానికులు, పోలీసులు భావించారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోనే హెడ్లైట్ పగిలి ఉండటంతో విజయవాడ శివారుకు వచ్చేసరికి పగిలినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు గొల్లపూడి నుంచి రామవరప్పాడు రింగు వరకు అన్ని సీసీ కెమెరాలు రికార్డ్ దృశ్యాలను రాజమండ్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముమ్మాటికీ హత్యే..
ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్ మరోసారి ఆరోపించారు. అయితే ఈ హత్య వెనక ప్రభుత్వమే ఉందా? అన్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘ ఈ ఘటనపై పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు హైరానా పడుతోంది. ప్రవీణ్ ది యాక్సిడెంట్గా చూపేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు. సీసీ ఫుటేజీ 11.42 గంటల వరకే ఎందుకు చూపెడుతున్నారు. ఆ తర్వాత ఫుటేజీ ఏమైంది. ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ కానే కాదు. కావాలంటే నేను కూడా అదే స్పీడ్లో బుల్లెట్ మీద హెల్మెట్ పెట్టుకొని అలాగే వెళ్లి అక్కడే పడతాను. చచ్చిపోతానో? లేదో? చూద్దాం.
Also read: Vishwavasu Nama Ugadi 2025: విశ్వావసు నామ ఏడాదిలో.. ఈ తేదీలు తప్పక గుర్తు పెట్టుకోండి..
ఇదంతా మీడియా ప్రతినిధుల ఎదురుగానే చేసి చూపిస్తాను. నా ఛాలెంజ్ను పోలీస్ వారు స్వీకరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు పడినా చావరు’ అని హర్షకుమార్ ఛాలెంజ్ చేసి మాట్లాడారు. మరోవైపు కాకినాడలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి, న్యాయం చేయాలని సంఘాలు డిమాండ్ చేశాయి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాల నాయకులు, పాస్టర్ ప్రవీణ్ ఫాలోవర్స్ పాల్గొన్నారు.