తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Electricity Tariffs: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ 2025-26 విద్యుత్ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై పడింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈ ప్రతిపాదనల టారిఫ్ ఆర్డర్ ను వాయిదా వేసింది. వాస్తవానికి ఈనెల 31కి లోపే విద్యుత్ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఆమోదం తెలిపాల్సి ఉంది. కానీ కోడ్ నేపథ్యంలో టీజీఈఆర్సీ దీన్ని వాయిదా వేసింది. ఈ ఆర్డర్ జారీ చేసే వరకు అంటే ఏప్రిల్ వరకు 2024-25 టారిఫ్ అమలుచేయాలని ఆదేశించింది.
Also read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు కీలక నిందితుడు!
కోడ్ ముగిసిన తర్వాత 2025-26 టారిఫ్ ఆర్డర్ పై స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా 2025-26 విద్యుత్ చార్జీల పెంపు, ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న రిలీజ్ చేశారు. కాగా మార్చి 19 నుంచి 21 వరకు పలు ప్రాంతాల్లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఆపై ఆర్డర్స్ రిలీజ్ చేసి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలుచేయాలని భావించారు. కానీ కోడ్ కారణంగా టీజీఈఆర్సీ చైర్మన్ నాగరాజ్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉండగా ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపు లేదని డిస్కంలు క్లారిటీ ఇచ్చాయి. సామాన్యులపై ఎలాంటి భారాన్ని మోపడం లేదని తెలిపాయి.