Kishan Reddy: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి జీ కిషన్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తక్కువగా నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఓటు శాతం కేవలం 40 శాతమే నమోదవుతున్నదని అన్నారు.
హైదరాబాద్లో ఓటు శాతాన్ని పెంచడానికి ఒక ఉద్యమంలా పని చేయాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఓటు వేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. ఓటు ఎవరికైనా వేయండి కానీ, ఓటు వేయడానికి ముందుకు రండి అంటూ సూచించారు. అదే ఎంఐఎం పోటీ చేసే స్థానాల్లో 80 శాతం పోలింగ్ నమోదవుతున్నదని అన్నారు.
Also Read: ఆర్జీవీ డైలాగ్ కాపీ కొడుతున్న తెలుగు ముఖ్యమంత్రులు జగన్, రేవంత్ రెడ్డి
దేశంలో 75 ఏళ్లపాటు ఆటవిక సంప్రదాయం త్రిపుల్ తలాఖ్ కొనసాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని రద్దు చేయలేదని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ వద్దన్నా.. దేశంలో ముస్లింలు అంతా ఏకమై ఘర్షణలకు దిగుతారని బెదిరించినా మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా ముస్లిం మహిళల మెడపై వేలాడుతున్న త్రిపుల్ తలాఖ్ అనే కత్తిని తొలగించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని ముస్లిం పురుషులు కూడా స్వాగతించారని తెలిపారు.
Also Read: ఇక రాజకీయ నాయకుల విచారణ? త్వరలో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు!
మహిళలకు అన్ని విధాల మోడీ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, మహిళలకు అవకాశాలు కల్పించినందున నేడు ఆర్మీలో కూడా నారీమణులు రాణిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. మొన్నటి రిపబ్లిక్ డే పరేడ్లో యువతులు అద్భుత విన్యాసాలు చేశారని అన్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల టాయిలెట్లు మోడీ ప్రభుత్వం నిర్మించిందని తెలిపారు. పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి వెళ్లినప్పుడు కూడా అత్తగారింటిలో టాయిలెట్ ఉన్నదా? అనే ప్రశ్న వేసేదాకా పరిస్థితులు వచ్చాయని అన్నారు. ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడటమే అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలకు మోడీ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని, అందుకే మళ్లీ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, సికింద్రాబాద్లో తనను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.