Group 1 Revaluation: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల వ్యవహారం మరోమారు హైకోర్టు తలుపు తట్టింది. గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలని కోరుతూ కొందరు అభ్యర్థులు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మెయిన్స్ పేపర్ల మూల్యంకనం లోపభూయిష్టంగా ఉందంటూ పిటిషనర్లు కోర్టులో వాదించారు. పేపర్లు దిద్దిన నిపుణుల నాణ్యతపైనా పిటిషనర్లు సందేహం వ్యక్తం చేశారు. దీంతో హైకోర్టు టీజీపీఎస్సీ (TGPSC)కి నోటీసులు జారీ చేసింది.
పిటీషనర్ల వాదన ఏంటంటే
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను తిరిగి మూల్యంకనం చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తమ వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు లాయర్.. కీలక అంశాలను లేవనెత్తారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 18 రకాల సబ్జెక్టులు ఉండగా కేవలం 12 మంది నిపుణులతోనే పేపర్లు దిద్దించారని పిటిషనర్లు ఆరోపించారు. పరీక్షలను 3 భాషల్లో నిర్వహించి తగిన నిపుణులతో పేపర్లను వ్యాల్యూయేషన్ చేయించలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒక మాద్యమంలో నిపుణులైన వారితో రెండు మాధ్యమాల పేపర్లు (తెలుగు, ఇంగ్లీషు) దిద్దించారని కోర్టుకు విన్నవించారు. ముఖ్యంగా తెలుగు మీడియంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.
టీడీపీఎస్సీకి నోటీసులు
గ్రూప్ 1 మెయిన్స్ వాల్యూయేషన్ లో లోపాలు ఉన్నందున తిరిగి రివాల్యూయేషన్ చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ వేసిన అభ్యర్థులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదన విన్న హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణనను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో టీజీపీఎస్సీ ఇచ్చే వివరణను బట్టి హైకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోనుంది. టీజీపీఎస్సీ వివరణతో సంతృప్తి చెందితే గ్రూప్ 1 రీవాల్యుయేషన్ కు హైకోర్టు అనుమతి కష్టమేనని చెప్పవచ్చు.
Read Also: Betting App Owners: బెట్టింగ్ యాప్స్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఏకంగా 19మందిపై..
గతేడాది పరీక్షలు
ప్రభుత్వ శాఖల్లోని 563 పోస్టుల భర్తీకి గాను గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 తేదీల మధ్య గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మార్చి 10న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఆ మర్నాడే గ్రూప్ 2 రిజల్ట్స్, అలాగే మార్చి 14న గ్రూప్ 3 ఫలితాలను బోర్డు విడుదల చేసింది. త్వరలోనే వాటికి సంబంధించి నియామక ప్రక్రియ మెుదలు కానుంది.
ఇవి కూడా చదవండి