తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Hyderabad Crime: ఇద్దరిని చంపుతా…బెయిల్ ఇప్పించాలని అడిగితే నిరాకరించాడన్న కక్షతో న్యాయవాదిని పట్టపగలే దారుణంగా హత్య చేసిన ఎలక్ట్రీషియన్ ఉదంతమిది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన సోమవారం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తుమ్మలూరుకు చెందిన ఎర్రబాపు ఇజ్రాయిల్ (55) పదేళ్ల క్రితం న్యూ మారుతీనగర్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుని ఇక్కడికి మకాం మార్చాడు. న్యాయవాది వృత్తిని చేస్తుండటంతోపాటు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకునిగా ఉన్నాడు.
Also read: Ramulu Naik on KCR: కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. అదేంటి అంతమాట అనేశారు!
ఇదిలా ఉండగా వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన దస్తగిరి (50) ఇజ్రాయిల్ ఇంట్లో పని చేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ వద్దకు వచ్చిన దస్తగిరి తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్పాడు. ఆ మహిళతోపాటు ఆమె భర్తను హత్య చేస్తానని తెలిపాడు. ఈ కేసులో తనను వీలైనంత త్వరగా బెయిల్ పై విడిపించాలని అడిగాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాడు. అయితే, ఇజ్రాయిల్ దీనికి నిరాకరించాడు. హత్యలు చేయటం తప్పని, ఆ ఆలోచనను విరమించుకొమ్మన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దస్తగిరి చంపాలనుకున్న మహిళ, ఆమె భర్త కొన్నిరోజులుగా కనిపించటం లేదు. వారిని చంపుతానని చెప్పిన నేపథ్యంలో ఇజ్రాయిల్ వారిని ఎక్కడికైనా పంపించి ఉంటాడని దస్తగిరి అనుమానించాడు.
Also read: Venkat Reddy: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బోనస్ కొనసాగింపు
ఈ క్రమంలో ఇజ్రాయిల్ వద్దకు వచ్చి ఆ ఇద్దరు ఎక్కడున్నారో చెప్పమని అడిగాడు. నాకు తెలియదని ఇజ్రాయిల్ జవాబు చెప్పగా దస్తగిరి అతనితో గొడవ పెట్టుకున్నాడు. వారిని చంపాలనుకున్న విషయం నీ ఒక్కనికే చెప్పాను…నువ్వే వాళ్లను ఎక్కడికో పంపించి ఉంటావు…ఆచూకీ చెప్పమని ఘర్షణ పడ్డాడు. ఆ తరువాత నీ సంగతి చూసుకుంటానంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఇజ్రాయిల్ మొబైల్ కు బెదిరింపు మెసెజీలు పంపించటం మొదలు పెట్టాడు. దాంతో ఇజ్రాయిల్ అతని నెంబర్ ను బ్లాక్ చేశాడు.
Also read: Yuva Vikasam Scheme: కార్పొరేషన్స్ మళ్లీ యాక్టివ్.. ఏకంగా రూ. 6 వేల కోట్లు కేటాయింపు..
అదే సమయంలో విషయాన్ని ఐఎస్ సదన్ పోలీసులకు తెలియచేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్ కు పిలిపించి అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించి పంపించి వేశారు. కాగా, తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించటాన్ని అవమానంగా భావించిన దస్తగిరి న్యాయవాది అయిన ఇజ్రాయిల్ పై మరింత కక్ష పెంచుకున్నాడు.
పది రోజులుగా ఇజ్రాయిల్ కదలికలను పసిగడుతూ వచ్చాడు. ఈ విషయం తెలియని ఇజ్రాయిల్ ఎప్పటిలానే సోమవారం ఉదయం ఇంటికి కొద్దిదూరంలో ఉన్న గ్రౌండ్ లో వాకింగ్ చేయటానికి తన బైక్ పై వెళ్లాడు. వాకింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద అతన్ని అడ్డుకున్న దస్తగిరి కత్తితో ఛాతీలో విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో రోడ్డుపై కుప్పకూలిపోయిన ఇజ్రాయిల్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రస్తుతం దస్తగిరి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
Also read: Meenakshi Natarajan: ఐక్యరాగమెత్తిన కాంగ్రెస్.. మీనాక్షి నటరాజన్ మార్క్ ఇదేనా?
పోలీసులపై ఆగ్రహం…
కాగా, ఐఎస్ సదన్ పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరి తనను చంపుతానని బెదిరిస్తున్నాడంటూ ఇజ్రాయిల్ పది రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వాళ్లు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు దస్తగిరిని అరెస్ట్ చేయకుండా కౌన్సెలింగ్ ఇచ్చి ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవటంతోనే దస్తగిరి ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడన్నారు. ఇదేం పోలీసింగో మాకు అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. హతుని కుటుంబానికి కూడా దస్తగిరి నుంచి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. వారికైనా భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/