Tariffs: సుంకాల విధింపు విషయంలో తగ్గేదేలే అన్న విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం సుంకాలు విధించిన ట్రంప్ వాటిని మార్చి 4 నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో టారిఫ్స్ పై తాజాగా మాట్లాడిన ట్రంప్.. భారత్ పై బాంబు పేల్చారు. భారత్ పై విధించిన సుంకాలు వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు అమెరికా చట్టసభల వేదికగా ట్రంప్ స్పష్టం చేశారు.
ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. మెుదటిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్కు హాజరై ప్రసగించారు. పదవి చేపట్టిన తర్వాత తాను తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులను వివరించారు. ఈ సందర్భంగా సుంకాల ప్రస్తావన తీసుకొచ్చిన ట్రంప్.. ఏప్రిల్ 2 నుంచి భారత్, చైనా సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధిక టారిఫ్ లు విధిస్తున్నట్లు అసహనం వ్యక్తం చేశారు.
‘భారత్ 100% సుంకం విధిస్తోంది’
అమెరికా వస్తువులపై ప్రపంచ దేశాలు విధిస్తున్న ట్యాక్స్ లపై అధ్యక్షుడు ట్రంప్ మరింత వివరంగా మాట్లాడారు. భారత్ తమపై 100 శాతం కంటే ఎక్కువ పన్ను విధిస్తున్నట్లు కాంగ్రెస్ సెషన్ లో పేర్కొన్నారు. అటు చైనా సైతం అమెరికా విధిస్తున్న సుంకాలకు రెండింతలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా ఏకంగా నాలుగు రెట్లు అధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు అమెరికా సమయం వచ్చిందన్న ట్రంప్.. ఆయా దేశాలపై ఏప్రిల్ 2 నుంచి కచ్చితంగా ప్రతీకార ట్యాక్స్ లు ఉంటాయని చెప్పారు. అమెరికాకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతోనే తనను ప్రజలు ఎంచుకున్నారని దానిని నెరవేర్చే విషయంలో వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. భారత్ సహా ఇతర దేశాలు తమ వస్తువులపై ఎంత టారిఫ్ లు విధిస్తాయో అంతే తిరిగి వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read: Yogi Adityanath: కుంభమేళాతో కోటీశ్వరులైన ఫ్యామిలీ.. సీఎం నోట విజయగాథ
ఉక్రెయిన్ అంశంపైనా..
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. రష్యాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని జెలెన్ స్కీ తెలిపినట్లు ట్రంప్ అన్నారు. భద్రతా హామీలకు బదులుగా ఖనిజాల ఒప్పందంపై అమెరికాతో సంతకాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు జెలెన్ స్కీ చెప్పారని పేర్కొన్నారు. రష్యా సైతం యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచనలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో త్వరలో ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.