Singareni: అవినీతి దందాలపై సింగరేణి ఉక్కుపాదం మోపనుంది. శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కొన్ని అరాచక శక్తులను ఇప్పటికే ఏరివేసినా ఇలాంటి ప్రయత్నాలు రిపీట్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి దందాలకు పాల్పడుతున్న వారిపై చర్యలకు సిద్ధమవుతోంది. ఇటీవల సంస్థలో పలువురు చేతివాటం ప్రదర్శించడంతో అలర్ట్ అయిన సింగరేణి అవినీతి దందాలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది.
అందుకోసం ప్రత్యేకంగా మెయిల్ ఐడీతో పాటు మొబైల్ నంబర్ ద్వారా సైతం ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లుచేసింది. పట్టించిన వారికి రూ.10 వేలు పారితోషికంగా ఇవ్వాలని నిర్ణయించింది. తద్వారా అయినా సంస్థలో కొనసాగుతున్న అవినీతి దందాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది.
సింగరేణిలో అవినీతి దందాలు చేసేవారు, వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారి సమాచారం తెలియజేయాలని సింగరేణి యాజమాన్యం అధికారులు, సిబ్బంది, కార్మికులకు స్పష్టంచేసింది. ఎందుకంటే మెడికల్ బోర్డు ప్రక్రియలో అన్ ఫిట్ చేయిస్తామని, బదిలీలు జరిపిస్తామని, కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని వైద్య పరీక్షల్లో ఫిట్ చేయిస్తామని, డిప్యూటేషన్లు, ఇంటర్నల్, ఎక్స్ టర్నల్ పరీక్షల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సింగరేణి ఉద్యోగిని ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే.
అందుకే సింగరేణి యాజమాన్యం అలర్ట్ అయింది. అమాయకులైన కార్మికులను వంచిస్తున్న ఎవరినైనా సరే సంస్థ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అవినీతి చర్యలకు పాల్పడే వారిని, వారికి వెనుక ఉండి సహకారం అందించే వారిని సైతం వదిలిపెట్టే ప్రసక్తే లేదని యాజమాన్యం హెచ్చరించింది.
Also read: TG Farmers: కొనుగోలు కేంద్రాలు.. అసౌకర్యాల నిలయాలు..
అవినీతికి బలైన బాధితులు, లేదా అవినీతి జరుగుతుందనే సమాచారం ఉన్న ఏ ఇతర కార్మికులైనా, ఇతరులైనా వెంటనే సింగరేణి విజిలెన్స్ శాఖకు తెలియజేయవచ్చని యాజమాన్యం సూచించింది. ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచడమే కాక వారికి సంస్థ పూర్తి రక్షణ కల్పిస్తుందని యాజమాన్యం స్పష్టంచేసింది. అలాగే సింగరేణి సంస్థ లో వివిధ పనులు చేయిస్తామని పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి వివరాలు, ఆధారాలు ఇచ్చిన వారికి రూ.10 వేల పారితోషకం కూడా ఇవ్వనున్నట్లు సంస్థ నిర్ణయించింది.
సింగరేణి కార్మికులు తప్పుడు మార్గాల్లో పయనించి తమ ఉద్యోగ జీవితాన్ని పాడుచేసుకోవద్దని, ప్రలోభ పెట్టే వారిని దగ్గరకు రానియొద్దని యాజమాన్యం హితవు పలికింది. ఏరియాల్లో, గనుల్లో, డిపార్ట్ మెంట్లలో సింగరేణి ఉద్యోగులు లేదా అధికారులు, లేక బయట వ్యక్తులు ఎవరైనా సరే లంచాలు ఆశిస్తున్నట్లయితే వారి వివరాలను విజిలెన్స్ శాఖకు మరియు ఏసీబీకి అందించి పట్టించాలని యాజమాన్యం సూచించింది.
అవినీతి, అక్రమాలను కూకటివేళ్లతో పెకిలించడానికి, సదరు వ్యక్తులను కటకటాల వెనక్కి నెట్టడానికి సింగరేణి యాజమాన్యం సంసిద్ధంగా ఉందనే మెసేజ్ ను యాజమాన్యం ఉద్యోగులు, సిబ్బందికి వివరించింది. అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఎవరైనా, ఏ హోదాలో ఉన్నా వదిలిపెట్టేది లేదని యాజమాన్యం హెచ్చరించింది. గతంలోనూ సింగరేణిలో అక్రమాలకు పాల్పడిన పలువురు ఉద్యోగులను యాజమాన్యం గతంలో డిస్మిస్ చేసింది.
వారిపై చట్టప్రకారం చర్యలు కూడా తీసుకుంది. కాగా భవిష్యత్ లోనూ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని భావించి విజిలెన్స్ శాఖ మెయిల్ ఐడీ vig@scclmines.com లేదా 94911 44104 కు కానీ సమాచారం ఇవ్వాలని సూచించింది. అవినీతి నిర్మూలనకు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది చూడాలి.