Etela Rajender: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి సంబంధించి బి ఫారాలపై భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) కుండబద్దలు కొట్టారు. తాను 25 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే రాజకీయ నాయకుడిగా ఉన్నానని, ఇక్కడ పార్టీ వ్యవహారాల బాధ్యత తనదేనని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టించి ప్రజలను మోసం చేసిందని ఈటల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
Also Read: MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మొదటి నుంచి మద్దతు ఇస్తుందని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ అంశం అభాసుపాలైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా, మూర్ఖంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ఈ రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఇది రాజ్యాంగ సవరణకు సంబంధించినదని, దీనిపై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
తక్షణమే పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఈటల రాజేందర్ ఆరోపించారు. స్థానిక సంస్థల బిల్లులు గతంలో పని చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ఎటువంటి కమీషన్ లేకుండా తక్షణమే చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. బిల్లులు రాక చాలా మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగం అవుతున్న గురుకులాలు
రెసిడెన్షియల్ స్కూళ్లలో డైట్ చార్జీలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆరు నెలలుగా అందడం లేదన్నారు. అలాగే, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అతి తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నుంచి తొమ్మిది నెలలుగా జీతాలు లేవని, ఎన్నికల కంటే ముందే ఈ సమస్యలన్నీ పరిష్కరించి జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్, గెస్ట్ లెక్చరర్స్ సమస్యలు పేరుకుపోయాయి. గెస్ట్ లెక్చరర్ల పునరుద్ధరణ చేయకపోవడం, రిటైర్ అయిన ఉద్యోగులకు సంవత్సరాలు గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
రైతు సమస్యలు, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి
ఎండాకాలంలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు రైతులకు ఇప్పటివరకు రూ. 500 బోనస్ ఇవ్వలేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 66 హామీల గురించి ఎవరూ మాట్లాడటం లేదని, కనీసం ఉన్న పెన్షన్లనైనా సకాలంలో ఇవ్వాలని ప్రజలు కోరుతున్న దుస్థితి నెలకొందని ఈటల రాజేందర్ అన్నారు.
హుజురాబాద్ ప్రజలకు భరోసా
హుజురాబాద్ ప్రజలు తనకు అండగా ఉన్నారని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై తాము పేదల కోసం నిరంతరం పోరాడతామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బీజేపీ బీ ఫాంలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ 25 ఏళ్లుగా ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉంది. 25 ఏండ్లుగా వారు నాకు అండగా ఉంటా భీ ఫాం మేమే ఇస్తామని, గెలిపించుకుని తీరుతామని ఈటల స్పష్టం చేశారు.
Also Read: Eatala Rajendar: ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
