Mynampally Hanumantha Rao: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌
Mynampally Hanumantha Rao( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mynampally Hanumantha Rao: శంబీపూర్ రాజుతో ఎందుకీ గొడవలు?

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఎక్కడేం జరిగినా అటు తిరిగి ఇటు తిరిగి మైనంపల్లి వైపే వేళ్లు చూపిస్తుండటం గమనార్హం. ఇక ఆయన అనుచరుల గురించి అయితే మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఓ వైపు మైనంపల్లి నోటి దురసు, మరోవైపు అనుచరుల తీరుతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెడ్డ పేరు వస్తోందని సొంత పార్టీ నేతలే నిట్టూరుస్తున్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.

మైనంపల్లి తీరును ఏమాత్రం సహించే పరిస్థితి లేదని పార్టీ గుర్రుగా ఉన్నట్లు టాక్. త్వరలోనే అధిష్టానం ఝలక్ ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు నోరు తెరిస్తే వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుండటం, అనుచరులు కూడా అనవసర విషయాల్లో తలదూరుస్తుండటం, సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా, కించపరిచే విధంగా పోస్టులు పెడుతుండటం, ప్రత్యర్థులకు ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయి. తీరా చూస్తే ఇప్పుడు మైనంపల్లి అనుచరులు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం, పోలీసు కేసులు నమోదవ్వడంతో ఎక్కడా ఈ వ్యవహారాలపైనే చర్చ జరుగుతున్నది.

 Also Read: Ponnam Prabhakar: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్

ఒకరికి నోటీసులు
బీఆర్ఎస్(Brs) ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును హత మారుస్తామని బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లడం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్(Brs) సీరియస్‌గా తీసుకున్నది. గులాబీ పార్టీ నేతలంతా ఆయనకు మద్దతుగా నిలుస్తూ సైబరాబాద్‌ పోలీస్‌(Cyberabad Police) కమిషనర్‌ అవినాశ్‌ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే గుర్తించి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో పాటు బీఆర్‌ఎస్‌ (Brs)నేతలు సీపీని కోరారు. ‘ ఉద్యమ వీరులను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక, కొందరు చేతకాని దద్దమ్మలు దొంగచాటున ఫోన్‌కాల్స్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అని బీఆర్‌ఎస్‌(Brs) నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు మైనంపల్లి రౌడీలా వ్యవహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని గులాబీ నేతలు నిప్పులు చెరిగారు. కాగా, శుక్రవారం నాడు ఈ కేసును సైబరాబాద్ పోలీసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. క్రైమ్ నెంబర్ 745/2025 కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో మనోహరాబాద్‌కు చెందిన మహేందర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీకి ఫోన్ చేసిన వారిలో ఉన్నట్లు గుర్తించి అతనికి 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారు గోవాలో ఉన్నట్లు సమాచారం. వీరంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కావడం గమనార్హం.

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్!
మహేందర్ మాత్రం ‘మీడియా ముందు పండబెట్టి తొక్కుతా అంటూ తిట్టిన వ్యక్తి శంభిపూర్ రాజుపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? కేవలం ఫోన్ చేసినందుకే మాపై కేసు ఎలా నమోదు చేస్తారు’ అని పోలీసుల(Police) ముందు వాపోయాడు. కాంగ్రెస్(Congress) నాయకులను ఎందుకు తిట్టావని అడుగుదామని ఎమ్మెల్సీకి తాను ఫోన్ చేశానని, అంతే తప్ప ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదని, అలా ఏమైనా తిట్టినట్టు ఆధారాలు ఉంటే ఆడియో బయటపెట్టాలన్నారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్సీ ఇలా చేస్తున్నారని ఆరోపించాడు. మొత్తానికి ఈ గొడవ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య మాట్లాడిన మాటలకే కారణం అయ్యుంటుందని పోలీసులు భావిస్తున్నారు. మిగతా ఇద్దరికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు దుండిగల్ పోలీసులు సిద్ధమయ్యారు.

మరో వివాదం..
మైనంపల్లి అనుచరుల అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌(BRS) మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. సోషల్‌మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. మైనంపల్లి అనుచరులు తమపై దాడి చేయడమే కాకుండా, సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని మహిళా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్వాల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇలా ఎక్కడ ఎలాంటి వివాదాలు చోటుచేసుకున్నా మైనంపల్లి, ఆయన అనుచరుల పేర్లే వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మైనంపల్లిపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? ఆయన నోటికి తాళం పడేదెప్పుడు? అని సొంత పార్టీ నేతలే ఎదురుచూస్తున్నారట.

 Also Read: Pawan Kalyan: విజేతలకు పవన్ కళ్యాణ్ అభినందనలు వచ్చేశాయ్..

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం