వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ (Warangal) శివారులోని మామునూరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో ఓ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికుల హృదయాలను కలిచివేసింది.
ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఓ లారీ రైలు పట్టాల లోడుతో వెళుతోంది. మామునూరు బెటాలియన్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రెండు ఆటోలని ఢీకొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడడంతో ఏడుగురు మృతి చెందగా… ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
కాగా, యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.