Student Shoots Teacher: ఉత్తరాఖండ్లో దారుణం చోటుచేసుకుంది. ఉదమ్ సింగ్ నగర్ జిల్లా (Udham Singh Nagar district)లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న గగన్దీప్ సింగ్ కోహ్లీ (Gangandeep Singh Kohli)పై ఆయన విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. శరీరం నుంచి బుల్లెట్ ను తీసివేయడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని గురు నానక్ స్కూల్లో (Guru Nanak School) గగన్దీప్ సింగ్ కోహ్లీ పనిచేస్తున్నారు. ఈ వారం ప్రారంభంలో 9వ తరగతి స్టూడెంట్ ను క్లాసులో చెంప దెబ్బకొట్టాడు. దీనిని అవమానంగా భావించిన సమరత్ భజ్వా (Samarath Bajwa).. బుధవారం (ఆగస్టు 20) తన టిఫిన్ బాక్స్ లో తుపాకీని పెట్టుకొని తరగతి గదికి వచ్చాడు. మధ్యాహ్నం విరామం తర్వా కోహ్లీ క్లాస్ రూమ్ నుంచి బయలుదేరుతుండగా.. టిఫిన్ బాక్స్ నుంచి తుపాకీ తీసి అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ బుల్లెట్ గగన్ దీప్ వీపు నుంచి దూసుకెళ్లి మెడ వద్ద ఆగిపోయింది.
ఆస్పత్రికి తరలింపు
తుపాకీ శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్కూల్ ఉపాధ్యాయులు.. తరగతి గదికి పరిగెత్తుకు వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న గగన్ దీప్ ను వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి బుల్లెట్ను విజయవంతంగా తొలగించినట్టు డాక్టర్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, మరింత పర్యవేక్షణ కోసం ICUకి తరలించనున్నట్టు చెప్పారు.
పోలీసుల అదుపులో విద్యార్థి
మరోవైపు కాల్పులకు పాల్పడిన 9వ తరగతి స్టూడెంట్ సమరత్ బజ్వాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన తర్వాత విద్యార్థి పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు అతడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాల్పులు జరిపిన తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అది విద్యార్థి వద్దకు ఎలా వచ్చిందన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మైనర్ కావడంతో అతడిపై IPC సెక్షన్ 109 కింద కేసు నమోదు చేశారు.
Also Read: Viral Video: నెట్టింట రచ్చ చేస్తోన్న లేగ దూడ.. క్రేజ్ మామూల్గా లేదుగా!
టీచర్పై పెట్రోల్ పోసిన మరో విద్యార్థి
అటు మధ్యప్రదేశ్ లోనూ ఇదే తరహాలో భయానక ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల మహిళా టీచర్ పై ఆమె మాజీ స్టూడెంట్ (18 year old student) పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సోమవారం (ఆగస్టు 17) మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు సూర్యాంశ్ పెట్రోల్ బాటిల్ (Petrol Bottle)తో టీచర్ ఇంటికి వెళ్లాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గుర్తించి మంటలను అదుపుచేశారు. అనంతరం ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. తనతో అనుచితంగా ప్రవర్తించడంతో సదరు విద్యార్థిపై టీచర్ స్కూల్లో కంప్లైంట్ చేసింది. దీంతో బాలుడ్ని స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు. ఆ కోపంతోనే సూర్యాంశ్ కోచర్ దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు.