Madhya Pradesh: మధ్యప్రదేశ్లో భయానక ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల మహిళా టీచర్ పై ఆమె మాజీ స్టూడెంట్ (18 year old student) దాడికి తెగబడ్డాడు. టీచర్ ఇంటికెళ్లి మరి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో గాయాలపాలైన టీచర్ ను స్థానికులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని అరెస్ట్ చేసి.. దాడికి గల కారణాలను వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ నర్సింగ్పూర్ జిల్లా (Narsinghpur district) కోట్వాలి పోలీస్ స్టేషన్ (Kotwali police station) పరిధిలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 ఏళ్ల విద్యార్థి సూర్యాంశ్ కోచర్ (Suryansh Kochar).. గతంలో తాను చదువుకున్న ఎక్సలెన్స్ స్కూల్ (ఉత్కృష్ట విద్యాలయం)లోని టీచర్ పై దాడికి తెగబడ్డాడు. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు సూర్యాంశ్ పెట్రోల్ బాటిల్ (Petrol Bottle)తో టీచర్ ఇంటికి వెళ్లాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు.
బాధితురాలి పరిస్థితి
బాధితురాలు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు గుర్తించి మంటలను అదుపుచేశారు. అనంతరం ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి శరీరంపై 10 – 15 శాతం కాలిన గాయాలు (Burn injuries) ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు. గాయాలు తీవ్రమైనవే అయినప్పటికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. మరోవైపు దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వారికి కీలక విషయాలు తెలిశాయి.
Also Read: BRS Party: బీఆర్ఎస్లో జూబ్లీహిల్స్ టెన్షన్.. సర్వేలకే పరిమితం.. గ్రౌండ్లోకి దిగేదెప్పుడు?
దాడి వెనుక కారణం
దాడికి పాల్పడ్డ విద్యార్థికి టీచర్ గత రెండేళ్లుగా తెలుసని పోలీసుల విచారణలో తేలింది. ఎక్సలెన్స్ స్కూల్లో (Excellence School) అతడు చదువుకుంటున్న క్రమంలో బాధితురాలు గెస్ట్ టీచర్ గా అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆమె పట్ల సుర్యాంశ్ ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో స్వాతంత్ర దినోత్సవానికి శారీ కట్టుకొని వచ్చిన టీచర్ పై.. సూర్యాంశ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై టీచర్ ఫిర్యాదు చేయడంతో సూర్యాంశ్ ను స్కూల్ నుంచి డిస్మిస్ చేశారు. ఫలితంగా అతడు మరో స్కూలుకు మారాల్సి వచ్చింది. దీంతో లేడీ టీచర్ పై పగ పెంచుకున్న సూర్యాంశ్.. సోమవారం (ఆగస్టు 18న) ఆమెపై దాడికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: CP Radhakrishnan Nomination: ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
నిందితుడిపై చర్యలు
సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మనోజ్ గుప్తా మాట్లాడుతూ.. ‘ఇది ఒక ప్రేమ, వ్యక్తిగత ప్రతీకారం’ కేసు అని తెలిపారు. దాడి ఘటనపై IPC సెక్షన్ 124Aతో పాటు మరిన్ని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి పూర్తి వాంగ్మూలం తీసుకున్న తర్వాత నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు వెల్లడించారు.