Jasprit Bumrah: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో చివరిదైనా ఐదవ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడడం లేదు. బుమ్రాపై శారీరక అలసటను తగ్గింపు ప్రణాళికలో భాగంగా ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ సిరీస్లో 5 మ్యాచ్ల్లో మూడింట్లో ఆడేయంతో ప్రస్తుతం జరుగుతున్న కెన్నింగ్టన్ ఓవల్ మ్యాచ్లో విశ్రాంతి కల్పించారు. దీంతో, ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ రెండో రోజున టీమ్తో బుమ్రా కనిపించలేదు. దీనిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐదవ మ్యాచ్కు తుది జట్టులోకి తీసుకోకపోవడంతో భారత జట్టు నుంచి బుమ్రాను రిలీజ్ చేశామని ప్రకటించింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఐదో టెస్టు మ్యాచ్లో రెండవ రోజు ప్రారంభానికి ముందు టీమ్ బస్సులో బుమ్రా కనిపించలేదని సమాచారం.
కాగా, ఇంగ్లండ్ టూర్ ప్రారంభానికి ముందే భారత ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లు మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో బుమ్రా మూడు టెస్టులకు మించి ఆడబోడని స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే లీడ్స్లోని హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్, లార్డ్స్లో జరిగిన మూడో టెస్టు, మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో ఆడాడు. దీంతో, చివరి టెస్టులో ఆడించలేదు. బుమ్రా ఫిట్నెస్ను కాపాడేందుకు బీసీసీఐ ఈ ప్రణాళికను అనుసరిస్తోంది.
సిరీస్లో రాణించిన బుమ్రా
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ సిరీస్లో మూడు టెస్టుల్లో కలిపి 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 14 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు ఐదు వికెట్ల అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో 26 సగటు వికెట్లు తీశాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మంచి ఫామ్లో ఉండడం, సిరీస్ను సమం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బుమ్రాను ఆడిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అతడిని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. దీనిపై భారత్ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డొషాటే కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also- Viral News: ఇంత దారుణమా? వాటర్ బాటిల్లో యురిన్..
“బుమ్రాను ఐదవ టెస్టులోకి తీసుకోవాలనే ఉద్దేశం మాకు కూడా ఉంది. కానీ, అతడి శారీరక స్థితిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్లో బుమ్రా ఇప్పటికే చాలా ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఆడింది మూడు మ్యాచ్లే కదా అని అనిపించవచ్చు. అందులోనూ మాంచెస్టర్లో ఒక్క ఇన్నింగ్స్లోనే బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ ఓవర్ల పరంగా చూస్తే బుమ్రా చాలా భారాన్ని మోశాడు. పర్యాటనకు ముందుగా చెప్పినట్టుగానే మూడు మ్యాచ్లకే అందుబాటులో ఉన్నాడు. దాని ఆధారంగా మేము అతడిని ఐదో టెస్టుకు తీసుకోకూడదని నిర్ణయించాం’’ అని రియాన్ టెన్ డొషాటే చెప్పారు.
ఐదో టెస్టులో భారత్ తుది జట్టు ఇదే
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.
Read Also- ACB Record: 145 ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్.. రాష్ట్రంలో ఇదే పెద్ద రికార్డ్