India Win: అత్యంత రసవత్తరంగా సాగిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్పై టీమిండియా అద్భుతమైన విజయం (India Win) సాధించింది. చేతిలో 4 వికెట్లతో చివరిరోజు 35 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 367 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, 6 పరుగుల తేడాతో భారత్ గెలుపు తీరాలకు చేరుకుంది. మ్యాచ్ దాదాపు చేజారిపోయిందనుకున్న సమయంలో భారత బౌలర్లు చెలరేగారు. విజృంభించి ఇంగ్లండ్ టేలండర్లను ఔట్ చేశారు. దీంతో, సిరీస్ 2-2తో సమం అయింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు, ఆకాశ్ దీప్ 1 వికెట్ తీశారు.
ఒంటి చేత్తో మైదానంలోకి క్రిస్ వోక్స్..
మ్యాచ్ గెలిచేందుకు ఇంగ్లండ్ టేలండర్లు కూడా గట్టిగానే పోరాడారు. చివరిరోజు 35 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగగా.. వికెట్ కీపర్ జేమీ స్మిత్ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత జేమీ ఓవర్టన్ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో జాస్ టంగ్ను ప్రసిద్ కృష్ణ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివరిలో గస్ అట్కిన్సన్ ప్రమాదకరంగా మారాడు. అతడికి తోడు గాయపడిన ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు. క్రిస్ వోక్స్ను బ్యాటింగ్కు రానివ్వకుండా ఆడిన అట్కిన్సన్ ఒక సిక్సర్ కూడా బాది భారత శిబిరంలో గుబులు పుట్టించాడు. అయితే, బంతి అందుకున్న మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బంతితో అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో, టీమిండియా 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. మహ్మద్ సిరాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్, హ్యారీ బ్రూక్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కాయి.
Read Also- Rajinikanth: ‘బాషా’ సినిమాకు ఆంటోని ఎలాగో.. ‘కూలీ’ సినిమాకు సైమన్ అలాగే.. నాగ్ అదరగొట్టేశాడు
విజయంపై సిరాజ్ ఏమన్నాడంటే..
మాంచెస్టర్ టెస్టులో భారత విజయంపై సిరాజ్ స్పందించాడు. ‘‘ సరైన లైన్ అండ్ లెంగ్త్తో బంతులు వేస్తే చాలు అని మనసులో ఆలోచించుకొని బౌలింగ్ చేశాను. నిజాయితీగా చెప్పాలంటే, నిన్న (ఆదివారం) బ్రూక్ క్యాచ్ పట్టే సమయంలో నేను అడుగు వెనక్కి వేసి రోప్పై పెడతానని అస్సలు ఊహించలేదు. మ్యాచ్ను మలుపు తిప్పిన క్షణం అది. అయితే, జట్టు కోసం ఏదైనా చేయగలనని ఎప్పుడూ నమ్మే వ్యక్తిని నేను. టీమ్ కోసం నేను సాధించగలననే నమ్మకంతో బౌలింగ్ చేశాను’’ అని సిరాజ్ పేర్కొన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత దినేష్ కార్తీక్ అడిగిన పలు ప్రశ్నలకు సిరాజ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
Read Also- Actress Urvashi: ‘ఉత్తమ నటి కావాలంటే.. యంగ్గా ఉండాలేమో’.. నటి షాకింగ్ కామెంట్స్!
టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై మాట్లాడుతారా?: కేఎల్ రాహుల్
మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లో విజయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాను. మేము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. భారత్ వరల్డ్ కప్ గెలిచిన క్షణాన్ని కూడా ఆస్వాదించాను. కానీ, టెస్ట్ వరల్డ్ కప్ను సాధించడాన్ని దేనితోనూ పోల్చలేం. టెస్ట్ క్రికెట్ నిలుస్తుందా లేదా అన్నదానిపై చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు వచ్చాయి. కానీ, ఈ సిరీస్లో ఇరు జట్లు ఆటతీరుతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేశాయి. ఈ సిరీస్లో మాకు గెలుపు అవకాశమే లేదని భావించిన పరిస్థితుల్లో మేం ఒక్కో మ్యాచ్ కష్టపడి ఆడాం. చివరకు 2–2తో సిరీస్ సమం చేశాం. సిరీస్ సమంగా అనిపించొచ్చు, కానీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు ఇది అద్భుతమైన విజయం. మున్ముందు భారత జట్టు విదేశాల్లోనూ చాలా సిరీస్లు గెలుస్తుంది. ఈ విజయమంతా జట్టుకే దక్కుతుంది’’ అని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.