Indian Team: ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు.. లక్ష్యఛేదనకు వచ్చేసరికి చేతులెత్తెశారు. 193 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక కీలకమైన మూడో టెస్టులో ఓడిపోయింది. అయితే దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అజారుద్దీన్ ఏమన్నారంటే?
లార్డ్స్ లో ఓటమి తర్వాత టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లపై భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు. వారి వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని మండిపడ్డారు. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), టెయిలెండర్లు చూపించిన పోరాటం గురించి ఆయన ప్రశంసించారు. అజహరుద్దీన్ మాట్లాడుతూ ‘కేఎల్ రాహుల్ మినహా జైస్వాల్, గిల్, పంత్, కరుణ్ నాయర్ వంటి స్టార్లు విఫలయ్యారు. టీమిండియా సరిగా బ్యాటింగ్ చేయలేదు. భాగస్వామ్యాలు లేకపోవడం వారికి పెద్ద సమస్యగా మారింది. గిల్ కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపారు’ అని అజారుద్దీన్ అన్నారు.
Also Read: Udaipur Files movie: ఉదయ్పూర్ ఫైల్స్ వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
జడేజాపై ప్రశంసలు
లార్డ్స్ టెస్టులో టెయిలండర్లతో కలిసి రవీంద్ర జడేజా చేసిన పోరాటం ఎంతో ప్రశంసనీయమని అజారుద్దీన్ అన్నారు. ‘జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు ఇంకా 15-20 పరుగులు చేసి ఉంటే పని సులభం అయ్యేది. అతడి బ్యాటింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదు చేయలేము. క్రీజులో రాయిలా నిలబడిపోయారు’ అంటూ అజారుద్దీన్ చెప్పుకొచ్చారు. కాగా మూడో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రవీంద్ర జడేజా 61*(181) నాటౌట్ గా నిలిచారు.