Diwali 2025: మరో ఐదు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఈ ఫెస్టివల్ వస్తుందంటే చాలు, ఇళ్లల్లో సంతోషం, సందడి నెలకొంటుంది.
చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ పండుగను జరుపుకుంటారు.
పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి, మిఠాయిలు తిని, టపాసులు కాలుస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. చాలా ఇళ్లలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. పూలు, పండ్లు, పలహారాలతో శ్రద్ధగా పూజలు చేస్తూ, ఈ పండుగ ఇంటికి కాంతిని, సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు. దీపాల వెలుగుతో ప్రతి ఇల్లు కాంతులతో మెరిసిపోతుంది. అయితే, ఈ పండుగ జరుపుకునేటప్పుడు కొంతమంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీపావళి రోజున కొన్ని పూజలు తప్పకుండా చేయాలి, అలాగే, కొన్ని ముఖ్య నియమాలను పాటించడం ముఖ్యం.
పండుగ రోజు ఈ తప్పులు అస్సలు చేయకండి?
లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలంటే ఈ రోజున ఆమెను భక్తితో పూజించాలి. అయితే, నలుపు రంగు దుస్తులు ధరించి పూజ చేయకండి. నలుపు శుభకార్యాలకు మంచిది కాదు. ఈ రంగు బట్టలు ధరించి పూజలు చేయడం దురదృష్టాన్ని తెస్తుందని చెబుతారు.అలాగే, లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచేటప్పుడు సరైన దిశను ఎంచుకోవాలి. పూజా స్థలంలో ఎడమవైపు తొండం ఉన్న గణేశుడి విగ్రహాన్ని ఉంచకూడదు.
లక్ష్మీ పూజ సమయంలో టపాసులు కాల్చకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. అలాగే, హారతి ఇస్తూ పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టకూడదు. దానికి బదులు ఒక చిన్న గంటను ఉపయోగించడం మంచిది. పూజ తర్వాత కలశంలోని నీటిని బయట పారబోయకుండా, ఇంట్లోని మొక్కలకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి సానుకూల ఫలితాలు వస్తాయని నమ్ముతారు.
