Rohit – Virat: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit – Virat) ఇద్దరూ టీ20 ఫార్మాట్తో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇద్దరూ వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలనేది ఇద్దరి డ్రీమ్గా ఉంది. అయితే, ఫిట్నెస్, రెగ్యులర్గా క్రికెట్ ఆడకపోవడం కారణంగా వన్డే జట్టులో వీరిద్దరికీ చోటు దక్కడం కష్టమని, త్వరలోనే వన్డే ఫార్మాట్కు కూడా వీడ్కోలు పలుకుతారంటూ కొన్ని వారాలుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అక్టోబర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటనే వీరిద్దరికీ చివరిదంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ కథనాలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్పై వెలువడుతున్న ఊహాగానాలను రాజీవ్ శుక్లా ఖండించారు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడతారని స్పష్టం చేశారు. ఒక టాక్ షోలో పాల్గొన్న రాజీవ్ శుక్లాను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ మాదిరిగానే కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా ఘనంగా వీడ్కోలు పలికే అవకాశముందా? అని ఓ హోస్ట్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన శుక్లా.. ఇద్దరూ ఇంకా వన్డేల్లో ఆడుతున్నారని, అలాంటప్పుడు ఈ స్థాయిలోనే ఆందోళన చెందడం ఎందుకు? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
‘‘వాళ్లిద్దరూ ఎప్పుడు రిటైర్ అయ్యారు?. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేలు ఆడుతారు. వాళ్లు ఇంకా ఆడుతుండగానే వీడ్కోలు గురించి మాట్లాడడం ఎందుకు?. మీరంతా ఇంత ముందుగానే ఎందుకు ఆందోళన చెందుతున్నారు?’’ అని రాజీవ్ శుక్లా ప్రశ్నించారు. ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలనేది ఎంత గొప్ప ఆటగాడికైనా బీసీసీఐ చెప్పబోదని, వీడ్కోలు నిర్ణయం పూర్తిగా ఆటగాడి మీదే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీసీసీఐ విధానం చాలా క్లారిటీగా ఉందన్నారు. బీసీసీఐ ఎప్పుడూ రిటైర్మెంట్ గురించి చెప్పబోదని, ఆ నిర్ణయం ఆటగాడే తీసుకోవాలని పేర్కొన్నారు. కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడని, రోహిత్ ఇంకా బాగా ఆడుతున్నాడని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఫ్యాన్స్ కూడా వీరిద్దరి రిటైర్మెంట్ గురించి ఇప్పటినుంచే ఆలోచించాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు.
రిటైర్మెంట్ దశ వచ్చినప్పుడు, ఎలా వ్యవహరించాలో అప్పుడు చూస్తామని రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు.కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడని, చక్కగా తన ఆటను కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు. ఇక, రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడుతున్నాడని, అలాంటప్పుడు వారి రిటైర్మెంట్ గురించి ముందే ఆందోళన చెందడం ఎందుకని అన్నారు. కాగా, అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఇద్దరూ తిరిగి ఈ మధ్య క్రికెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. తిరిగి వన్డేల్లో కొనసాగేందుకు సన్నద్ధమవుతున్నారు. తద్వారా ఊహాగానాలకు చెక్ పెట్టినట్టుగా అయింది.
టీ20లు, టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల భవితవ్యంపై చర్చలు ఊపందుకున్న నేపథ్యంలో రాజీవ్ శుక్లా ఈ విధంగా స్పందించారు. మరోవైపు, వీరిద్దరి భవిష్యత్ విషయంలో అంత ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై బీసీసీఐ చాలా కూల్గా ఉందంటూ మరికొన్ని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.