Nepal Interim Government: నేపాల్లో కేపీ ఓలీ శర్మ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో, మధ్యంతర ప్రభుత్వం (Nepal Interim Government) ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఖాట్మండ్ మేయర్ బాలెన్ షా, నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి ఇద్దరూ నాయకత్వ బాధ్యతలకు ముందుకు రాకపోవడంతో, నేపాల్ వ్యాప్తంగా విశేషణ ఆదరణ ఉన్న ప్రముఖ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కుల్మన్ ఘిసింగ్కు మధ్యంతర ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని ‘జెన్ జెడ్’ నిరసనకారుల నాయకులు నిర్ణయించారు. కుల్మన్ ఘిసింగ్ ప్రస్తుతం నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
దేశంలో విద్యుత్ కోతలకు ముగింపు పలికేలా కృషి చేసిన ఆయన దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఘిసింగ్కు దేశంలో క్లీన్ ఇమేజ్ ఉంది. విలువ పాటించే వ్యక్తి, దేశ భక్తుడిగా, అందరి మంచి కోరుకునేవాడిగా నేపాలీలు కీర్తిస్తుంటారు. అందుకే, ఎన్నికల వరకు దేశాన్ని నడిపించే బాధ్యతలు ఆయనకే అప్పగించాలని ‘జెన్ జెడ్’ నిరసనకారులు అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని గురువారం మధ్యాహ్న సమయంలో ప్రకటించారు. తాత్కాలిక కౌన్సిల్ ఏర్పాటు చేసే విషయంలో దేశ రాజకీయ మార్గదర్శకత్వంలో అద్వితీయ విజయం సాధించామని ‘జెన్ జెడ్’ ప్రకటించింది.
Read Also- H-City Project: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. రూ.5942 కోట్లతో కొత్త రోడ్ ప్రాజెక్టులు ప్రారంభం
నిజానికి, తాత్కాలిక కౌన్సిల్కు బాలెన్ షా నాయకత్వం వహిస్తారని, ఆయనే అనువైన అభ్యర్థి అంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, బాధ్యతలు చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి కూడా బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు రాలేదు. రాజ్యాంగపరమైన, చట్టపరమైన అడ్డంకులతో పాటు వ్యక్తిగతంగా అలాంటి బాధ్యతలు చేపట్టడం తన మనసుకు నచ్చదని ఆమె సున్నితంగా తిరస్కరించారు. అందులోకి ఆమె వయసు 70 ఏళ్లు దాటడం కూడా జెన్ జెడ్ నాయకత్వం అంతగా ఆసక్తి చూపలేదు. ఆమె తగినవారు కాదని భావించింది.
కుల్మన్ ఘిసింగ్ 1970 నవంబర్ 25న నేపాల్లోని రామేఛప్ జిల్లాలోని బెతాన్ అనే గ్రామంలో పుట్టారు. భారత్లోని జంషెడ్పూర్లో ఉన్న రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివారు. అనంతరం నేపాల్లోని పుల్చోక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపర్చుకునే ఉద్దేశంతో ఎంబీఏ కూడా పూర్తి చేశారని నేపాల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేతపై తమ అభిప్రాయాన్ని జెన్ జెడ్ నాయకుల బృందం ఆర్మీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తెలియజేసినట్టుగా నేపాల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనాలంటూ ఆహ్వానం రావడంతో వెళ్లి చెప్పినట్టుగా తెలుస్తోంది. నేపాల్ సైన్యాధిపతి జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం ఆయన ముఖ్యనేతలతో పాటు జెన్ జెడ్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు.