Family Politics: వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత, రోహిణి ఆచార్య.. ఈ వ్యక్తులు వేర్వేరు అయినా, ఒకే ప్యాటర్న్ వీరిలో కనిపిస్తోంది. రాజకీయాల్లో కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారు కూడా ఈ ప్యాటర్న్ ఏంటో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీల నుంచి గెంటివేతకు గురైనవారు. ఇంకా, క్లారిటీగా చెప్పాలంటే అన్నయ్యలు సారధ్యం వహిస్తున్న పార్టీల నుంచి బహిష్కరణకు గురైనవారు. ఇంకా విడమరచి చెప్పాలంటే, రాజకీయాల్లో సొంత కుటుంబాలకు (Family Politics) దూరమైనవారు.
ఏ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం? అన్న చందంగా వీరు ముగ్గురూ తమ కుటుంబ పార్టీల నుంచి వేరుపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ షర్మిల, బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా, బీహార్లో పవర్ పాలిటిక్స్కు కేరాఫ్ అడ్రస్ లాంటి కుటుంబాల్లో ఒకటైన లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. లాలూ కూతురు, పార్టీ నడిపిస్తున్న తేజశ్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య కూడా ఆర్జేడీ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. అంతేకాదు, కుటుంబంతో బంధాన్ని కూడా తెంచుకున్నట్టు ఆమె ప్రకటించారు. తిట్టపోశారని, చెప్పు చూపించారని ఆమె ఆరోపించారు. తండ్రికి కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడారన్న పేరున్న రోహిణి కూడా ఈ విధంగా ఫ్యామిలీకి, పార్టీకి దూరం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఆడబిడ్డ పాత్ర కేవలం ప్రచారానికేనా?
షర్మిల, కవిత, రోహిత్ ఎడిసోడ్లను నిశితంగా గమనిస్తే, కుటుంబ పార్టీల్లో ఆడబిడ్డలు తమ స్థానం కోసం, గుర్తింపు కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు రాజకీయ ప్రయాణం విషాదగాథగా మారుతోంది. మొత్తంగా వారసత్వ రాజకీయాల్లో ఆడబిడ్డ పాత్ర కేవలం ప్రచారానికి మాత్రమే అన్నట్టుగా ఉంది. తెరవెనుక ఉంటూ సహకరిస్తే ఫర్వాలేదు. అలా కాదు, గుర్తింపు కావాలి, అధికారంలో భాగం అవుతామంటూ ఆశపడితే, అన్నలు ఒప్పుకోరు. తదుపరి పర్యావసనాలు, ఇంట్లో నుంచి గెంటివేతలే. పార్టీలో గుర్తింపు, అధికారంలో భాగం కోరుకున్న ఈ ముగ్గుర మహిళా నాయకురాలు తమ కుటుంబాల నుంచి వేరుపడాల్సి రావడం క్లియర్ కట్గా కనిపించింది. పార్టీపై పట్టు కోసం పురుష వారసులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు.
Read Also- KP Vivekananda: కాంగ్రెస్ ట్రాప్లో కల్వకుంట్ల కవిత పడిపోయారు: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
వారసత్వ రాజకీయాల్లో లింగ వివక్ష!
పార్టీలో తమ గుర్తింపు కోసం ఆడబిడ్డలు చేస్తున్న పోరాటాలు అంతిమంగా వ్యక్తిగతంగా కుటుంబాలకు కూడా దూరం చేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను చూస్తు, వారసత్వ రాజకీయాల్లో లింగ వివక్ష ఉన్నట్టుగా కనిపిస్తోంది. కుటుంబ పార్టీలు ఏవైనా కావొచ్చు, తమ వారసత్వాన్ని నిలుపుకోవడానికి, తర్వాతి తరం నాయకులుగా కూడా పురుషులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సహజమైపోయింది. ఆడబిడ్డలు ఎంత సమర్థవంతులైనా, ఎంతటి ప్రజాదరణ సంపాదించినా, అంతిమంగా పార్టీ పగ్గాలు కొడుకులే దక్కుతున్నాయి. మహిళా నేతలు తమకు అడ్డుగా ఉన్నారని అన్నలు లేదా తమ్ముళ్లు భావిస్తే, బయటకు నెట్టేయడం లేదా పక్కన పెట్టేయడం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఈ విధంగా కుటుంబ పార్టీల్లో జరుగుతున్న ఆధిపత్య పోరాటాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మహిళలను కేవలం ప్రచారం కోసమో, సానుభూతి కోసమో వాడుకోవడం మానేసి, వారి సామర్థ్యం, నాయకత్వ లక్షణాలను గుర్తించి, సమాన అవకాశాలు కల్పించినప్పుడే కుటుంబ పార్టీలకు, ప్రజాస్వామ్యానికి విలువ, గౌరవం పెరుగుతాయని అభిప్రాయపడతున్నారు.
