RTA Corruption: ‘తిలా పాపం తలా పిడికెడు’ అనే నానుడి వరంగల్ పరిధిలోని రవాణా శాఖ కార్యాలయం (ఆర్టీఏ) వ్యవహారాలను చూస్తే అక్షర సత్యమని స్పష్టమవుతోంది. అవినీతికి అడ్డాగా మారాయనే ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీఏ కార్యాలయాలు, తనిఖీ కేంద్రాలపై ఇటీవల ఆయా విభాగాల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కొందరు ఉద్యోగులు, పలువురు దళారులను అదుపులోకి తీసుకుని, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, వరంగల్ రేంజ్లో మాత్రం ఎక్కడా దాడులు జరగకపోవడమే. దీనికి కారణం రేంజ్లో పనిచేస్తూ వసూళ్ల రాజుగా పేరు తెచ్చుకున్న ఓ అధికారి నడిపిస్తున్న మంత్రాంగమే అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అవినీతికి అలవాటు పడి అడ్డగోలుగా డబ్బు వసూలు చేస్తున్న కొందరు ఆర్టీఏ ఉద్యోగుల నుంచి ఆ అధికారి ప్రతినెలా ఠంచనుగా వాటాలు తీసుకుంటూ చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని ఆర్టీఏ వర్గాలే చెబుతున్నాయి.
దళారుల లేకుండా..
ఆర్టీఏ కార్యాలయాల్లో వేళ్లూనుకుపోయిన అవినీతికి అడ్డుకట్ట వేయడానికి లెర్నింగ్, డ్రైవింగ్ అనుమతులు, ఎటువంటి అభ్యంతరం లేని ధృవపత్రాలు వంటి దాదాపు 56 సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ, ఇప్పటికీ దళారి లేనిదే ఏ ఆర్టీఏ కార్యాలయంలోనూ పనులు జరగడం లేదనేది వాస్తవం. కొత్త వాహనం కొనుక్కుని రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్లినా, ఆశకు మరిగిన సిబ్బంది వారికి చుక్కలు చూపిస్తున్నారు. అదే దళారి ద్వారా వెళితే నిమిషాల్లో పని చేసి పెడుతున్నారు. పనిని బట్టి వచ్చిన వారి నుంచి కనీసం వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్న దళారులు, తమ కమీషన్ను ఉంచుకొని మిగతా డబ్బును ఆర్టీఏ ఉద్యోగులకు ఇస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం కార్యాలయ సమయం ముగియగానే, ఉద్యోగులు, దళారులు ముందుగా నిర్ణయించుకున్న చోట కలుసుకుని ఈ డబ్బును పంచుకుంటున్నారు.
Also Read: Sujeeth: సుజీత్కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!
ఉమ్మడి వరంగల్కు నో
రాష్ట్రం మొత్తం మీద దాడులు జరిగినా, ఏసీబీ వరంగల్ రేంజ్ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు ఆర్టీఏ కార్యాలయాలపై మాత్రం దాడులు జరగకపోవడం గమనార్హం. కొంతకాలం క్రితం మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో పని చేస్తున్న ఓ వాహన తనిఖీ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు తప్ప, కార్యాలయాల్లో సాగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయలేదు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో దళారిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి చెప్పిన ప్రకారం, ప్రతి రోజూ కనీసం రెండు లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు అవుతాయి. ఇలా అడ్డగోలుగా పై సంపాదనలు చేస్తున్న ఆర్టీఏ ఉద్యోగుల నుంచి సదరు వసూళ్ల రాజు వాటాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిగినా ఒక్క వరంగల్ రేంజ్లో మాత్రం జరగలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో మంత్రులపై మనీ ప్రెజర్.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ మంత్రి
