TG Global Summit: తెలంగాణ రైజింగ్ 2047″ దార్శనిక పత్రంగా ప్రభుత్వం భావిస్తుంది. రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తు కు బాటలు వేసేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఉపయోగపడుతుందని ప్రభుత్వం వివరిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ(Telangana)ను ఆవిష్కరించడమే ఈ డాక్యుమెంట్ టార్గెట్. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రోడ్ మ్యాప్. తెలంగాణ రాష్ట్ర ఉజ్జ్వల భవిత కోసం.. ప్రజల భవిష్యత్తు కోసం.. భావి తరాల కోసం.. ముందుచూపుతో “తెలంగాణ రైజింగ్ 2047” డాక్యుమెంట్ ను తయారుచేశారు. ఈ డాక్యుమెంట్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించారు. అన్ని శాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్ని రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ డాక్యుమెంట్ తయారీలో నపీతి కీలక భూమిక నిర్వహించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(Indian School of Business) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నారు. వరుస సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన విధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వీటన్నింటినీ విశ్లేషించుకొని.. వడపోసి.. తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచింది. ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుంది.
4 లక్షల మంది అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్..
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్(Telangana Rising Document Vision) ప్రధాన లక్ష్యం. దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాల కు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పన లో పాలుపంచుకున్నారు. ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి ,అదునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయని ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రం లో అన్ని ప్రాంతాల అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది. హైదరాబాద్(Hyderabad) సిటీతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పంగా డాక్యుమెంట్ లో ఎజెండా పొందుపరిచారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలు రాయి ని డాక్యుమెంట్ నిర్దేశించింది. 2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా పదో వంతు కు చేరాలని లక్ష్యం గా ఎంచుకున్నది.
Also Read: Plane Crash: కుప్పకూలిన విమానం.. 90 గ్రామాల్లో పవర్ కట్.. అసలేం జరిగిందంటే?
లక్ష్య సాధనకు మూడు సూత్రాలు
ఆర్థిక వృద్ధి: ఆవిష్కరణలు మరియు ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం.
సమ్మిళిత అభివృద్ధి: యువత, మహిళలు, రైతులు మరియు అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.
సుస్థిర అభివృద్ధి: అన్ని రంగాలలో సుస్థిరతను పొందుపరచడం మరియు 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం.
మూడు ఉత్ప్రేరకాలు
సాంకేతికత, ఆవిష్కరణ: పాలన, పరిశ్రమలు మరియు సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం.
సమర్థవంతమైన ఆర్థిక వనరులు: పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.
సుపరిపాలన: పారదర్శక, జవాబుదారీ మరియు పౌర-కేంద్రీకృత పాలనను అందించడం.
మూడంచెల వ్యూహం
తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న, రంగాల వారీగా.. మూడు జోన్లుగా విభజన. అభివృద్ధి ప్రామాణికంగా రాష్ట్రాన్ని మూడు జోన్లు గా విభజించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ
160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్(ORR) లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్ మరియు ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది.
పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ
ఔటర్ రింగ్ రోడ్, 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోన్. తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్లు ఏర్పాటు.
రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ
ప్రాంతీయ రింగ్ రోడ్ దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి.
Also Read: indian Pilots: దేశంలోని ఆరు ప్రధాన ఎయిర్లైన్స్లో 13,989 పైలట్లు పని చేస్తున్నట్లు కేంద్రం వెల్లడి
పది కీలక వ్యూహాలు
ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది.
3-జోన్ల రాష్ట్రం: సమతుల్య అభివృద్ధికి క్యూర్,ప్యూర్,రేర్ నమూనా
విచక్షణ నుండి విధానానికి: పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
గేమ్-ఛేంజర్ ప్రాజెక్టులు: భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు.
సమర్ధ పాలన: డిజిటల్ గవర్నమెంట్, T-ఫైబర్, SPEED వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
నాలెడ్జ్ హబ్: ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం .
సుస్థిర సంక్షేమం: మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.
అభివృద్ధి నిధులు: మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
పర్యావరణం మరియు సుస్థిరత: వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం.
సంస్కృతి: రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. ప్రోత్సహించడం.
ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత: పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.
ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రత్యేకతలు
83 పేజీలతో విజన్ డాక్యుమెంట్-2047 రూపకల్పన
తెలుగు, హిందీ, ఇంగ్లిష్లో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో విజన్ డాక్యుమెంట్
యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం
10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
Also Read: Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత: కమిషనర్ సునీల్ దత్

