UTF Leader Chava Ravi: పీఆర్సీ అమలు గడువు దాటి రెండేళ్లు కావస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని జూలై 2023 నుంచి అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ( Hyderabad) హైదరాబాద్లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read: MLA Satyanarayana: కోటి మంది మహిళలను.. కోటీశ్వరులను చేయడమే లక్ష్యం!
షెడ్యూల్ విడుదల చేయాలి
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతినెలా రూ.700 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారని, కానీ గతనెల రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేశారని వివరించారు. నిర్ణయించిన ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేసవిలో చేస్తామన్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా పూర్తి చేయకపోవడం విచారకరమని, తక్షణమే షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ప్రమాదంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ.. జూలై 9 న కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో కోల్ కతాలో జరిగే స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రజతోత్సవ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ఉపాధ్యక్షురాలు దుర్గా భవాని, కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాములు, రాజశేఖరరెడ్డి, శాంతకుమారి, నాగమణి, రంజిత్ కుమార్, రాజు, మల్లారెడ్డి ,శ్రీధర్ , రవికుమార్, రవిప్రసాద్ గౌడ్ , జ్ఞాన మంజరి, సింహాచలం, వెంకటప్ప, యాకయ్య కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Rupee Fall: మన ‘రూపాయి’కి ఏమైంది?.. ఇవాళ ఒక్కరోజే భారీ పతనం